ఆర్మీ రిక్రూట్మెంట్లో అపశృతి: 14 మందికి గాయాలు
విజయనగరం: విజయనగరంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో వరుసగా అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. శనివారంనాడు నలుగురికి గాయాలు కాగా, ఆదివారం వేకువ జామున 14 మందికి గాయాలయ్యాయి. ఆర్మీలో సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/డ్రెస్సర్/వెటర్నరీ ఉద్యోగాల కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణ, యానాం ప్రాంతాల అభ్యర్థులకు ఆదివారం ఎంపిక నిర్వహించారు. వీరు శనివారం రాత్రి తొమ్మిది గంటలకే రిక్రూట్మెంట్ జరిగే పోలీసు బ్యారెక్స్ వద్దకు చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట నుంచి నాలుగు గంటల మధ్య అభ్యర్థులు పలుమార్లు తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో లోనికి విడిచిపెట్టడంతో 14 మంది గాయాలపాలయ్యారు.
తోపులాటను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లను తోసుకొని అభ్యర్థులు లోనికి ప్రవేశించారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఇద్దరిని స్థానిక తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని కొప్పెర గ్రామానికి చెందిన కొప్పర మురళీమనోహర్ కాగా, మరొకరు కాశీబుగ్గకు చెందిన కొర్రాయి శంకరరావుగా పోలీసులు గుర్తించారు.

కాగా, పోలాకి మండలం జిల్లేడువలస గ్రామానికి చెందిన తోట అప్పలనాయుడు వెన్నుపూసకు బలమైన గాయం కావడంతో అతనిని విశాఖపట్నంలోని సూర్య ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. మిగిలిన వారు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన డి.మధు ఎడమచేతికి బలమైన గాయమైంది.
మిగిలిన వారిలో బి.వినోద్కుమార్, టి.పూర్ణారావు, ఆర్.పార్వతీశం, పి.కుమార్, పి.అప్పలరాజు, కె.దుర్గాప్రసాద్, డి.శ్రీనివాసరావు, కె.అప్పలనాయుడు, పి.మధు, యు.రమేష్, ఎన్. ధనరాజు, ఎస్. భాస్కరరావు, ఎన్.నాగేంద్రబాబు, కె.నారాయణరావు, జి.శ్రీనివాస్, పి.శ్రావణ్లు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications