రెండు బైక్లు రాసుకున్నాయి.. సినిమాను తలపించే సీన్!
రోడ్డు పైన ప్రయాణిస్తున్న సమయంలో రెండు బైక్లు పరస్పరం రాసుకున్నాయి. ఇది ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. సినిమా సీన్లను తలపించేలా అది కనిపించింది.
కడప: రోడ్డు పైన ప్రయాణిస్తున్న సమయంలో రెండు బైక్లు పరస్పరం రాసుకున్నాయి. ఇది ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. సినిమా సీన్లను తలపించేలా అది కనిపించింది. ఈ సంఘటన కడప జిల్లా రైల్వే కోడూరు పాత బస్టాండు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
బస్టాండు వద్ద ఇద్దరు యువకులు బైక్ పైన వెళ్తున్నారు. అంతలో దాదాపు పదిమంది వ్యక్తులు పరుగెత్తుకుంటూ వచ్చారు. బైక్ వెనుక ఉన్న అతనిని లాగి బాగా కొట్టారు. ముందు కూర్చున్న వ్యక్తి వారితో వాగ్వాదానికి దిగాడు. గొడవ పెద్దగా అయింది.
దెబ్బలు తిన్న యువకుడు ఇడ్లీ బండిపై ఉన్న కర్రను తీసుకుని తనను కొడుతున్న వారిని చితక్కొట్టాడు. భయపడి వచ్చిన వారు తలోవైపు పారిపోయారు. పారిపోతూపోతూ వారిలో ఒక వ్యక్తి... నువ్వు పోలీసులతో పెట్టుకున్నావు.. తడాఖా చూపిస్తామని హెచ్చరించాడు. దీంతో బైక్ వెనుక పైన కూర్చున్న వ్యక్తి మరింత బాగా కొట్టాడు.
ఇదంతా సినిమా సన్నివేశాన్ని తలపించేలా కనిపించింది. ఈ సంఘటనను చూస్తున్న అక్కడి వారు ఏం జరుగుతుందో తెలియక అవాక్కయ్యారు. ఆ తర్వాత బైక్ పైన వచ్చిన ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత పోలీసులకు విషయం తెలిసింది. సంఘటన పైన ఆరా తీశారు. కాగా బైక్ పైన వెనుక కూర్చున్న వ్యక్తి చేతిలో దెబ్బలు తిన్న వారిలో ఇటీవల నియమించిన కమ్యూనిటీ పోలీస్ (సీపీవో)లో కొందరు ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే, రెండు బైక్లు రాసుకోవడమే ఈ గొడవకు కారణమని చెబుతున్నారు.