ఉద్యోగులకు ప్రభుత్వ "ఆప్షన్"- సరిగ్గా సమ్మె వేళ: సర్వీసా - స్ట్రైకా..ఎటు వైపు..!!
ఏపీలో ఇప్పుడు ఉద్యోగుల సమ్మె వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రభుత్వం ఒక వైపు చర్చలకు ఆహ్వానిస్తూనే... ఉద్యోగుల పైన ఒత్తిడి పెంచే వ్యూహాలు అమలు చేస్తోంది. అటు ఉద్యోగ సంఘాల నేతలు అన్నీ ఒకే తాటి పైకి రావటంతో బలంగా కనిపిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలకు నేరుగా నో అని చెప్పకుండా షరతులు మాత్రం వర్తిస్తాయని చెప్పుకొస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధ్రరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లుగా ఉద్యోగులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను సమ్మెలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉద్యోగుల విషయంలో ద్విముఖ వ్యూహం
ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నిత్యం సచివాలయంలోనే ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం నిరీక్షిస్తోంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం కొత్త జిల్లాల నోటిఫికేషన్లు జారీ చేసింది. ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేలా కార్యాచరణ సిద్దం చేసింది. అయితే, తాజాగా ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ కీలక అంశాన్ని ప్రస్తావించారు. అదే ఇప్పుడు ఉద్యోగుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజనపై ప్రభుత్వ కమిటీ కసరత్తు చేస్తోందని ఆయన వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను విభజించే ప్రక్రియను అధికారికంగా మొదలుపెట్టిందనేది స్పష్టం అవుతోంది. ఈ అంశంపైన ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ సైతం సమావేశమైంది.
చర్చలకు వస్తాం.. కండీషన్లు అప్లై
తాజాగా, ఉద్యోగ సంఘాల నేతలు సైతం కొత్త జిల్లాల ప్రక్రియ పైన స్పష్టత ఇచ్చారు. సమ్మె సమయం వరకు ప్రభుత్వ విధుల్లో ఉంటామని..ఆ తరువాత సమ్మెలోకి వెళ్తామని తేల్చి చెప్పారు. అధికారులు తమ పైన ఒత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించవద్దని కోరారు. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పటి వరకు వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కడ పని చేయాలి.. ప్రస్తుతం ఉన్న స్థానాల్లో కొనసాగేదెవరు.. ఎవరు ఏ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుందనే దాని పైన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరనున్నారు.
ఇందు కోసం ఉద్యోగులకు అందుబాటులో ఉంచేందుకు జిల్లాల వారీగా సబ్ కమిటీ లు ఏర్పాటు చేస్తున్నారు. సమ్మె సమయంలో సరిగ్గా ప్రభుత్వం ఈ ఆప్షన్ల ఎంపిక ప్రారంభించేలా కార్యాచరణ సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
కొత్త జిల్లాలు.. ఆప్షన్లు - సర్వీసు
ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వం వారికి ఆప్షన్లు ఎంచుకొనే వీలుగా సమయం పొడిగించే అవకాశం లేదని చెబుతున్నారు. ఖచ్చితంగా సమ్మెలో ఉన్నా.. ముందుగా ఆప్షన్లు ఎంచుకోవటం సర్వీసు పరంగా ఉద్యోగులకు అనివార్యంగా మారే పరిస్థితి ఉంది. దీని ద్వారా ఉద్యోగుల నుంచి ఉద్యోగ సంఘాల నేతల పైన ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇది ఉద్యోగుల సర్వీసు..భవిష్యత్ కు సంబంధించిన అంశం కావటంతో సమ్మె కంటే ప్రభుత్వం నిర్దేశించిన ఆప్షన్ల ఎంపికకే ప్రాధాన్యత ఇస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో జనవరి వేతనాలు చెల్లించటం ద్వారా వేతనాలు గ్రాస్ గా చూస్తే తగ్గలేదనేది క్లారిటీ వచ్చేస్తుందనేది ప్రభుత్వ మరో అంచనా.
రోజు రోజుకీ పెరుగుతున్న ఉత్కంఠ
ఇటు కొత్త జిల్లాల అంశం పైన వెల్లడవుతున్న అభిప్రాయాల ద్వారా వారంతా సైతం కొత్త జిల్లాలను ఆహ్వానిస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఇటు ప్రభుత్వం... అటు ప్రజా సంఘాలు సైతం కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ముందుకే వెళ్లాలని భావిస్తున్నాయి. ఇందులో ప్రజాభిప్రాయ సేకరణ మరింత కీలకం కానుంది. అదే సమయంలో ఉద్యోగుల పైన ఒత్తిడి పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.
మరో వైపు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. కొత్త జిల్లాల ప్రక్రియలో భాగంగా కింది స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ ఉద్యోగులే చేయాల్సి ఉంటుంది. దీంతో.. అటు ప్రభుత్వం..ఇటు ఉద్యోగ సంఘాల వ్యూహాల నడుమ...ఈ ఆప్షన్ల వ్యవహారం.. ప్రభుత్వం నిర్ణయించిన "టైమింగ్" మరింత ఉత్కంఠను పెంచుతోంది. దీంతో..ఈ నెల వేతనాల జమ మొదలు... సమ్మె తేదీ వరకు ప్రతీ రోజు..ప్రతీ పరిణామం ఆసక్తి కరంగా మారనుంది.