బీఆర్ఎస్ కు ఏపీలో యూత్ జేఏసీ ఆహ్వానం-తిరుపతి, విశాఖలో సభలు-కేసీఆర్ కు ఆహ్వానం
ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ఏపీకి రావాలని ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీ విద్యార్ది, యువజన జేఏసీ కేసీఆర్ కు ఆహ్వానం పలికింది.
ఒంగోలు లో ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో మాట్లాడిన నేతలు.. రాజకీయ ఉద్యమాలకు పురిటగడ్డ ఒంగోలు నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు.
ఏపీలో రాజకీయ మార్పు కోసం కేసీఆర్ నాయకత్వంలో కొత్త ఉద్యమ పంథా చేపడుతున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. బడుగు,బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ కు ఏపీ ప్రజల మద్దతు ఉంటుందన్నారు.

తెలంగాణ మాదిరి ఏపీలో కూడా అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని జేఏసీ నేతలు కోరారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఎంపీలు ఎలా తెగించి కొట్లాడారని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి కేసీఆర్ పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. ఏపీలో మాత్రం పార్టీలు వ్యాపారవేత్తలకు టికెట్లు ఇచ్చాయన్నారు. ప్రత్యేక హోదా మీద ఏపీ నేతలు కేంద్రాన్ని నిలదీయడంలో విఫలమయ్యారని, ఏపీ నేతలు వాళ్ల ఆస్తులు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవ చేయడంలో లేదన్నారు.
బీఆర్ఎస్ ఎంపీల్లా ఏపీ నేతలు ఎందుకు పోరాడలేకపోతున్నారని జేఏసీ నేతలు ప్రశ్నించారు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం ఎంతైనా ఉందన్నారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. త్వరలో తిరుపతి, విశాఖపట్టణంలో నిర్వహించే భారీ సభలకు కేసీఆర్ ను ఆహ్వానిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications