తప్పలేదు: లోకేశ్ తగ్గారు, సుజనా పట్ల చంద్రబాబుది మెతక వైఖరే?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ నుంచి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, బీజేపీ అభ్యర్థిగా సురేష్ ప్రభు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 11:07 గంటలకు అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కేంద్ర మంత్రి సుజనా చౌదరికి రాజ్యసభ సీటు కేటాయింపుపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుజనా చౌదరికి సీటు ఇవ్వరని, ఆయనపై వస్తున్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయని గత కొంతకాలంగా పార్టీ నేతలే చెప్తూ వచ్చారు. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సోమవారం సాయంత్రం సుజనా చౌదరిని రాజ్యసభకు చంద్రబాబు నామినేట్ చేశారు.
సుజనాను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేయడానికి అనేక కారణాలున్నాయి. గడచిన ఎన్నికల్లో టీడీపీకి సుజనా ఏం చేశారో మన కంటే పార్టీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు. సుజనా పేరుని రాజ్యసభకు ఖరారు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సుజనా ఆదుకున్నారని చెప్పకనే చెప్పారు.
దీంతో సుజనా విషయంలో బాబుది మొదట్నుంచి మెతకవైఖరినే అవలంభిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఆయన ముందుకు వచ్చారు. ఏం కావాలో చెప్పండని బాబును నేరుగా అడిగే సత్తా సుజనాకు ఉంది. 2014 ఎన్నికలకు ముందు ఆర్ధికంగా చితికిపోయింది.

ఇలాంటి సమయంలో పార్టీని ఆర్ధికంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల సుజనాకు రాజ్యసభ సీటు కేటాయించరనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న విషయంలో సుజనా విమర్శలెదుర్కొంటున్నారని, ఆర్థిక నేరగాడన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో సుజనాకు చంద్రబాబు మద్దతు ఉండదని అందరూ భావించారు. ఎందుకంటే ఎవరిమీదైనా విమర్శలు వస్తే వారిని బాబు దూరంగా పెడతారని ప్రచారం ఉంది. హెరిటెజ్ డైరెక్టర్ పేరు పనామా పేపర్స్లో రావడంతో అతడితో ఉన్నపళంగా రాజీనామా చేయించిన వైనాన్ని మనం చూశాం.
అయితే సుజనా విషయంలో ఇలా జరగలేదు. బహుశా కేంద్ర మంత్రి వర్గంలో ఉండటం వల్లే కాబోలు. అంతేకాదు పార్టీ కోసం పనిచేసిన నేతలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో సుజనాకు రెండోసారి రాజ్యసభ సీటు దక్కిందని పలువురు పార్టీ నేతల అభిప్రాయం. అంతేకాదు సుజనా తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతారు.
వార్తల్లో పెద్దగా కనిపించరు. తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. అయితే ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు, సుజనాకు చెడిందని.... అందుకే మారిషస్ బ్యాంకు వ్యవహారంలో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు పలికే టీవీ చానెళ్లో, సుజనాకు వ్యతిరేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ సుజనాకు రాజ్యసభ సీటు కేటాయించడంతో కేవలం ఇవన్నీ కూడా మీడియా వార్తలేనని తేలిపోయింది. అంతేకాదు లోకేశ్, సుజనాల మధ్య పొరపొచ్చాలు ఏమీ లేవని కూడా తేలిపోయింది. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి రుణమాఫీ చెల్లింపు విషయంలో, రాజధానికి నిధులు లాంటి కీలక కమిటీల్లోనూ భాగస్వామిగా ఉన్నారు.
అంతేకాదు ఢిల్లీ పెద్దలతో కీలక చర్చల్లో భాగస్వామిగా ఉంటూ ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య సమస్యలు రాకుండా చూడటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు భారీగా రాబట్టామని అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఏపీ ప్రజలకు వివరించిన సందర్భాలు అనేకం. అయితే ఆ ఘనతంతా బాబుకు, మోడీకే దక్కుతుందని చెప్పారు.
కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా అటు బీజేపీకి, ఇటు టీడీపీకి మధ్య వారధిగా ఉన్నారు. అందుచేతనే సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు పెద్దఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చారు.












Click it and Unblock the Notifications