కూటమి సర్కార్ పై అసెంబ్లీలో సుజనా అసంతృప్తి- ఆ మూడు విషయాల్లో..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే విపక్ష వైసీపీ మాత్రం హోదా ఇవ్వలేదనే కారణంతో సభకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలతోనే సభను నడుపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ పోషించాల్సిన విపక్ష పాత్రను కూటమి పార్టీల ఎమ్మెల్యేలే పోషిస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందన్న చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా మాట్లాడటంపై సీఎం చంద్రబాబు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇవాళ కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఓ మూడు కీలక అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. వీటిలో అమరావతి రైతుల సమస్యలు ఒకటి కాగా, విశాఖలోని రుషికొండ భవనాల వ్యవహారం మరొకటి, రాష్ట్ర ఎన్నికల సంఘంలో వైసీపీ అనుకూల ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చిన వ్యవహారం ఇంకొకటి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గించిన సాయిప్రసాద్ అనే ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి కీలక బాధ్యతలు ఇవ్వడం కరెక్టేనా అని సుజనా చౌదరి ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నించారు. అలాగే గత అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి రైతుల ఆర్తనాదాలు గత ఐదేళ్లు తాను చూశానని తెలిపారు. ప్రభుత్వం వచ్చి 15 నెలలవుతున్నా వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

గత సమావేశాల్లో స్పీకర్ 2 గంటలు సమయం ఇచ్చి చర్చిద్దామన్నారని, కానీ ఇప్పటివరకూ అది జరగలేదన్నారు. కాబట్టి ఇప్పటికైనా అమరావతి రైతుల సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు విశాఖలో రుషికొండ ప్యాలెస్ పై చదరపు అడుగుకు 26 వేలు ఖర్చుపెట్టారని, దుబారా చేశారని మాట్లాడారని, అలాగే పర్యావరణ ఉల్లంఘనలు కూడా జరిగాయని సుజనా గుర్తుచేశారు. అయినా ఇప్పటికీ కూటమి సర్కార్ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వచ్చి ఇంతకాలం జరుగుతున్నా పాత ప్రభుత్వంలో అధికారులు, పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications