జగన్ కు త్వరలో బిగ్ షాక్ ? డీజీపీతో చర్చిస్తున్న సిట్ ఛీఫ్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోందా ? మద్యం స్కాం తొలి ఛార్జిషీట్ లో పేరు ప్రస్తావించి వదిలేసిన సిట్.. ఇప్పుడు రెండో ఛార్జిషీట్ లో ఆయన్ను నిందితుడిగా చేర్చేందుకు సిద్దమవుతుందా ? ఈ మేరకు జగన్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించాలని భావిస్తున్నారా ? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. వీటికి బలం చేకూర్చే విధంగా ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిందని చెబుతున్న రూ.3500 కోట్ల మద్యం స్కాంలో అంతిమ లబ్దిదారుగా సిట్ భావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సమన్లు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు తాజాగా హైదరాబాద్ లో మరో నిందితుడు వరుణ్ పురుషోత్తం విదేశాలకు పారిపోతుండగా అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి విచారించారు.

వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిన్న హైదరాబాద్ శివార్లలోని ఓ ఫాంహౌస్ లో 11 కోట్లు పట్టుకున్న సిట్ అధికారులు ఈ మొత్తం మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికు చెందినదేనని లీకులు ఇచ్చారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన బెయిల్ ను అడ్డుకునేందుకే ఇలా సిట్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ తాజా పరిణామాలపై చర్చించేందుకు సిట్ ఛీఫ్ రాజశేఖర్ బాబు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వచ్చారు. డీజీపీ హరీష్ గుప్తాకు మద్యం స్కాంపై తాజా వివరాల్ని ఆయన అందిస్తున్నారు. అదే సమయంలో 11 కోట్ల వ్యవహారంతో పాటు జగన్ కు సమన్లు జారీ చేసే అంశంపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు సమన్లు జారీ చేస్తే తలెత్తే పరిణామాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications