రఘురాం సిమెంట్స్: జగన్కు మళ్లీ సిబిఐ సమన్లు
వీరంతా నవంబరు 11న హాజరు కావాలని అందులో ఆదేశించింది. క్విడ్ ప్రో కో కింద పెట్టుబడులు ఆకర్షించారని సిబిఐ మోపిన అభియోగాల్లో రఘురాం సిమెంట్స్ వ్యవహారం ఒకటి. ఆర్సి 19ఏ/(2011) కేసులో ఇప్పటికి 10 చార్జిషీట్లు దాఖలు చేయగా.. పరిగణనలోకి తీసుకున్న వాటిలో ఇది ఏడోది. ఈ అభియోగపత్రానికి న్యాయస్థానం సిసి నంబరు ( 25/2013)ను కేటాయించింది.
జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన రఘురాం సిమెంట్స్లో, కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వ్యవహారంలో సహకరించారని నిందితులపై ఐపిసి 420, 120-బి, అవినీతి నిరోధక చట్టం-1988లోని 13 (1) (డి) ఇతర సెక్షన్ల కింద సిబిఐ అభియోగాలు మోపింది. ఇందులోనూ జగన్, విజయసాయిని ఏ1, ఏ2గా పేర్కొంది. ఇతర నిందితులుగా రఘురాం (భారతి) సిమెంట్స్ (ఏ3), జె.జగన్మోహన్ రెడ్డి (ఏ4), గనులశాఖ మాజీ ఎండి రాజగోపాల్ (ఏ5), ప్రభు (ఏ6), కృపానందం (మాజీ ఐఏఎస్-ఏ7), శంకరనారాయణ (ఏ8).
భారతి సిమెంట్స్ కంపెనీ 1999 మే నెలలో ఏర్పాటైంది. దీనికి 2006 మే 1న వైయస్ జగన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వివిధ కంపెనీల నుంచి భారతీలోకి పెట్టుబడులు ప్రవహించాయి. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ క్విడ్ ప్రో కో కింద షేర్ల కొనుగోలు రూపంలో 2007లో రూ.30 కోట్లు పెట్టారు. మళ్లీ అక్టోబరులో రూ.67 కోట్లు పెట్టారు. ఒక్కో వాటా ముఖవిలువ రూ.10 కాగా, రూ.1450గా లెక్కగట్టి ఈ పెట్టుబడులు పెట్టడం వ్యాపార సూత్రాలకు భిన్నంగా ఉందని సిబిఐ పేర్కొంది. అటుపైన భారతి సిమెంట్స్ పేరును దాని ప్రతినిధులు రఘురాం సిమెంట్స్గా మార్చారు.