ప్రైవేటు స్కూళ్లలో ఈడబ్ల్యూఎస్ కోటా-సుప్రీంకోర్టు కీలక ఆదేశం..!
దేశవ్యాప్తంగా విద్య హక్కు చట్టం అమల్లోకి వచ్చినా ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్ధులకు సీట్లు కేటాయించేందుకు పలు చోట్ల నిరాకరిస్తున్న పరిస్ధితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్లకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఇలా విద్యా హక్కు చట్టం కింద 25 శాతం ఉచిత సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. దీనిపై స్పందించిన బోంబే హైకోర్టు ఈ ఉత్తర్వుల్ని కొట్టేసింది. దీన్ని తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది.
సీజేఐ డీవై చంద్రహుద్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం..ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ తరఫున దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. ఇందులో దేశంలో వివిధ హైకోర్టులో వేర్వేరు ఉత్తర్వులు ఇస్తున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. విచారణ సందర్భంగా పేద విద్యార్ధులు ఉత్తమ ప్రైవేటు స్కూళ్లలో చదువుకునేందుకు అర్హత ఉందని సీజే చంద్రచూడ్ తెలిపారు. సదుపాయాలు, మంచి విద్య అందకపోయినా ప్రభుత్వ స్కూళ్లలోనే వారు చదువుకోవాలా అని సీజే ప్రశ్నించారు.

తన బాల్యంలో మరాఠీ మీడియం స్కూల్లోనే చదువుకున్నానని, అక్కడ మంచి విద్య, సదుపాయాలు అందడం వల్లే తాను ఆ తర్వాత ఢిల్లీ వర్సిటీకి ఉన్నత చదువుల కోసం వచ్చినా అక్కడ ఈశాన్య భారత విద్యార్ధులతో మమేకం కాగలిగి భారత దేశమంటే ఏంటో అర్ధం చేసుకోగలిగానని సీజే చంద్రచూడ్ వెల్లడించారు. లేకపోతే ఈశాన్య భారతం అంటే ఏంటో ఎలా తెలుస్తుందన్నారు. కాబట్టి పేద విద్యార్ధులకు చిన్నతనంలో మంచి విద్య అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని ఆదేశిస్తూ దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications