నిమగడ్డ కేసుపై సుప్రీం కీలక ఆదేశాలు..వ్యాఖ్యలు: జగన్ సర్కార్ విజ్ఙప్తికి నో: 3 వారాల తరువాతే
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయట్లేదని, ఉద్దేశపూరకంగానే కాలయాపన చేస్తోందంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఈ పిటీషన్పై విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది. సమగ్రంగా విచారించాల్సి ఉంని స్పష్టం చేసింది.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్కుమార్ను పునర్నియంచాలని ఆదేశిస్తూ కొద్దిరోజుల కిందట ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటీషన్ను దాఖలు చేసింది. ఈ పిటీషన్పై కూడా సుప్రీంకోర్టు ఇదివరకే విచారణను పూర్తి చేసింది. జగన్ ప్రభుత్వం చేసిన విజ్ఙప్తి మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయట్లేదు జగన్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్దేశపూరకంగానే కాలయాపన చేస్తోందని, తనను పునర్నియమించకుండా అడ్డుకుంటోందంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ బుధవారం విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ కేసులో మరికొంతమందిని విచారించాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం చూసుకుంటే.. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానం ఖాళీగా లేనట్టేనని పేర్కొంది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడానికి నిరాకరించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో ఏకీభవించట్లేదని, ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేదని స్పష్టంచేసింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ పిటీషన్పై విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.