ఏపీ మద్యం స్కాం- సిట్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం- రెండేళ్లయినా ఏమీ దొరకలేదు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కుంభకోణం జరిగిందంటూ హడావిడి చేసి రెండేళ్ల క్రితం కేసు నమోదు చేసిన సీఐడీ సిట్ అధికారులు ఇప్పటికీ ఏమీ తేల్చకపోవడంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైపెచ్చు ఈ కేసులో నిందితులుగా సిట్ పేర్కొన్న వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ తమ వద్దకు రావడంపై మండిపడింది. ముందు సిట్ తీరును పరిశీలిస్తామని, అనంతరం హైకోర్టు తీర్పుపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది.
మద్యం స్కాం కేసులో సిట్ అధికారులు రెండేళ్ల నుంచీ దర్యాప్తు చేస్తున్నా ఏమీ కనుగొనకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డికి ఊరట కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. సిట్ కు పలు ప్రశ్నలు వేసింది. రాజ్ కెసిరెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ.. దీనిపై మీరు సీరియస్ గానే ఉన్నారా అని ప్రశ్నించింది. అతని ముందస్తు బెయిల్ పెండింగ్ లో ఉండగానే ప్రొడక్షన్ వారెంట్ అడగడంపైనా ఆక్షేపించింది.

అప్పటికే కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోయే అవకాశమే లేదని సిట్ కు సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రాజ్ కెసిరెడ్డి కస్టడీకి పోలీసులు ప్రిపేర్ కాకపోవడం వల్లే ప్రొడక్షన్ వారెంట్ అడిగినట్లు చెప్పగా.. పోలీసులు ప్రిపేర్ కాకుండానే జ్యుడియషల్ కస్టడీ ఎలా అడుగుతున్నారని నిలదీసింది. ప్రొడక్షన్ వారెంట్ అనేది అరెస్టు వారెంట్ తో సమానమని సుప్రీంకోర్టు సిట్ కు గుర్తుచేసింది. ఈ సందర్భంగా సిట్ వ్యవహారశైలిని ఆక్షేపిస్తూనే, వారు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందనలు తెలియజేయాలంటూ నిందితులు రాజ్ కెసిరెడ్డి, డి. వాసుదేవరెడ్డికి నోటీసులు జారీ చేసింది.














Click it and Unblock the Notifications