వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబుది క్రెడిట్ చోరీ.. ఎలాగో చెప్పిన వైసీపీ!
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ తమ ప్రభుత్వానిదని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వెలిగొండ నిర్మాణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్గారు తన హయాంలో చేసిన చారిత్రక పనులను తానే చేసినట్లుగా సీఎం చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని వైయస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఫైర్ అయ్యారు.
వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబుది క్రెడిట్ చోరీ
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో జగన్గారు ఆ ప్రాజెక్టులో 85 శాతానికి పైగా పనులు పూర్తి చేసి, 2024, మార్చి 6న జాతికి అంకితం చేశారని వెల్లడించారు. అయినా వెలిగొండ ప్రాజెక్టు మొత్తం తానే నిర్మించినట్లు చంద్రబాబు బిల్డప్ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.

నిర్వాసితులకు ఇంకా అందని పరిహారం
మరోవైపు ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు కూడా ఇంకా పరిహారం చెల్లించలేదని అన్నారు. 1996 మార్చి 5న చంద్రబాబు దీనికి శంకుస్థాపన మినహా చేసిందేమీ లేదన్నారు.
ఆ తర్వాత 2004 వరకు అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎన్ని మీటర్ల సొరంగం తవ్వారు అంటే ఏదీ లేదు. 1996లో ఆయన ప్రాజెక్టు కోసం ఒక రూ.11 లక్షలు ఖర్చు చేశారు. అది కూడా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా సభ నిర్వహణ కోసం ఖర్చు చేశారన్నారు.
జగన్ పనులు దాదాపు పూర్తి చేసి జాతికి కూడా అంకితం చేశారు
2004లో ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం కింద వెలిగొండ ప్రాజెక్టును పరుగులు పెట్టించారన్నారు. ప్రాజెక్టుకు రెండో సొరంగాన్ని ప్రతిపాదించి సమగ్ర డీపీఆర్ తెచ్చింది వైఎస్సార్ అన్నారు. నల్లమల సాగర్ 3 డ్యాములు, ఫీడర్ ఛానల్ నిర్మించి ప్రాజెక్టుకు పూర్తి రూపునిచ్చారన్నారు. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి.
వెలిగొండ ప్రాజెక్టును దాదాపు పూర్తిచేసిన వైయస్ జగన్, 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారన్నారు.
ప్రారంభం అయిన ప్రాజెక్ట్ కు మళ్ళీ రిబ్బన్ కటింగ్ ఏంటి చంద్రబాబు
ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగిన ప్రాజెక్టుకు వెళ్లి మళ్లీ రిబ్బన్ కట్ చేయడానికి చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? చంద్రబాబు ఎప్పుడూ జేబులో కత్తెర, చేతిలో రిబ్బన్ పట్టుకుని ఎదుటివారు చేసిన పనులకు క్రెడిట్ కొట్టేయడానికే చూస్తుంటారని ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, గ్రామాలు త్యాగం చేసిన నిర్వాసితులను వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారులు విచారించి 758అర్జీలు అర్హత గలవని తేల్చినా వారికి పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.













Click it and Unblock the Notifications