చంద్రబాబు భవితవ్యం నేడు తేలిపోతుందా ? సుప్రీంలో మధ్యాహ్నం తుది విచారణ !
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనను గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేయడం, రిమాండ్ కు పంపడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తుది విచారణ చేపట్టబోతోంది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు లాయర్లతో పాటు సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఇవాళ మరోసారి సీఐడీ లాయర్ వాదనలు, ఆ తర్వాత చంద్రబాబు లాయర్ కౌంటర్ వాదనలతో విచారణ ముగించబోతోంది.
2018 జూలైలో అవినీతి నిరోధక చట్టానికి పార్లమెంటు తీసుకొచ్చిన సెక్షన్ 17ఏ సవరణ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు లాయర్లు ఆయనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం వర్తించదని చెబుతోంది. ఇరువైపులా లాయర్లు తమ వాదనకు మద్దతుగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పుల్ని ప్రస్తావించారు. అలాగే ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పలు ధర్మ సందేహాలు లేవనెత్తింది.

వీటిపై గత శుక్రవారం సాగిన విచారణలో సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. అనంతరం ఈ కేసు విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. ఇవాళ విచారణలో తన వాదనలు వినిపించేందుకు మరో అరగంట సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టులో ఈ విచారణ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ముకుల్ రోహత్గీ వాదనలు పూర్తయ్యాక చంద్రబాబు తరఫున లాయర్ హరీష్ సాల్వే కౌంటర్ వాదనలు వినిపిస్తారు. దీంతో విచారణ పూర్తవుతుంది. ఆ తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సెక్షన్ 17ఏ వర్తింపు విషయంలో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది. రాబోయే రోజుల్లో ఎన్నో కేసులకు ఇది మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉండటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పూర్తిస్దాయిలో వాదనలు వింటోంది. ఇప్పుడు సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని తేలితే మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ ఈ తీర్పు ఆధారంగా ఎన్నో కేసుల భవితవ్యం తేలే అవకాశం ఉంది. అలాగే వర్తించదని తేలినా సరే ఇలాగే పలు కేసులపై ప్రభావం చూపనుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications