చంద్రబాబుXలోకేష్ లేదా గెలిచే వారికి టిక్కెట్: కర్నూలుపై ఎస్వీ వర్సెస్ టీజీ భరత్
కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వేడి రాజేస్తోంది. ఇక్కడి నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని గతంలో మంత్రి నారా లోకేష్ ప్రకటించినప్పుడు ఎంపీ టీజీ వెంకటేష్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. కర్నూలు సీటుపై ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ (టీజీ వెంకటేష్ తనయుడు) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?
కర్నూలు నుంచి లోకేష్ పోటీ చేస్తే నేను త్యాగం చేస్తా
కర్నూలు స్థానం నుంచి మంత్రి నారా లోకేష్ పోటీ చేయాలని ఎస్వీ మోహన్ రెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. లోకేష్ కోసం తాను సీటును త్యాగం చేస్తానని చెప్పారు. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేస్తే తాను మరోచోట సీటు అడగనని, పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. కానీ కర్నూలు లోకసభ సీటు వేరేవాళ్లకు ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పారు.
చంద్రబాబు పోటీ చేయాలి... టీజీ భరత్ కౌంటర్
మంత్రి నారా లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేయాలని ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నారని, కానీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని తాను గత ఏడాదే కోరానని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ గుర్తు చేశారు. చంద్రబాబు వల్లే నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి అవుతోందని టీజీ భరత్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి కర్నూలు నుంచి పోటీ చేస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తే 75వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. అంతేకాకుండా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపిస్తామన్నారు.
లేదంటే గెలిచే వారికి టిక్కెట్
కర్నూలు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, కుప్పం నుంచి లోకేష్ పోటీ చేయాలని టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ముఖ్యమంత్రి పోటీ చేయకుంటే గెలిచే వారికి టిక్కెట్ ఇవ్వాలని చెప్పారు. కర్నూలు సీటుపై తెలుగుదేశం పార్టీలో మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు, లోకేష్లు ఇక్కడి నుంచి పోటీ చేస్తే తమకు అభ్యంతరం లేదని, తాము పార్టీ కోసం పని చేస్తామంటూ నేతలు చెబుతున్నారు. కానీ వారు పోటీ చేయకుంటే మాత్రం తమకే టిక్కెట్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.