బైక్పై వచ్చి.. మహిళలే లక్ష్యంగా ఇంజెక్షన్ సిరెంజ్ దాడి, ఎవరు, ఎందుకు?
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, పాలకోడేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు మహిళలను, యువతులను లక్ష్యంగా చేసుకొని సిరెంజి దాడులకు పాల్పడుతున్నారు. బైక్ పైన వచ్చి వారి పైన సిరెంజిలు విసురుతున్నారు. దీంతో వారు స్పృహ కోల్పోతున్నారు.
గత మూడు రోజులుగా ఆరుగురు మహిళల పైన ఇలాంటి దాడులు జరిగాయి. దీంతో, మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ పనిని ఎవరు చేస్తున్నారు? ఒక్కరే చేస్తున్నారా? లేక సమూహంగా చేస్తున్నారా? సైకోగా మారి అలా చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఉదయం పాలకోడేరు మండలం గొరగొరలమూడి వద్ద ఇద్దరు యువతుల పైన ఇంజెక్షన్ సిరెంజిలతో దాడి చేశారు. బైక్ పైన వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతులు స్పృహ కోల్పోయారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.
జిల్లాలోని మొగల్తూరు మండలంలో ఓ వ్యక్తి మెడికల్ షాపు వద్ద సిరెంజిలు కొంటుండగా పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మరోచోట ఇలాంటి దాడి జరిగింది. స్థానికులు వెంబడించడంతో పరారయ్యారు.
నాగ కుమారి అనే మహిళ పైన సిరెంజి దాడి జరిగింది. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఎవరు ఇలా చేస్తున్నారో తెలియక ప్రజలు గందరగోళానికి, భయానికి గురవుతున్నారు. మంగళవారం జరిగిన ఘటనలు ఒకే తరహా ఉండటంతో ఒకరే ఈ పనికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇచ్చే సమాచారం ఆధారంగా పోలీసులు ముందుకెళ్లవచ్చు.