బియాండ్ బెంగళూరు- కంప్లీట్ ఏఐ యూనివర్శిటీ: డీకే శివకుమార్ ప్రకటన- దేశంలో మొట్టమొదటిది
ఇండియన్ సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బెంగళూరు.. తన పేరును మరోసారి సార్థకం చేసుకుంది. తన సత్తా చాటుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ ఇండెక్స్లో 26వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో శరవేగంగా పురోగమిస్తోన్న నగరాలపై నిర్వహించిన సర్వేలో తొలి 30 స్థానాల్లో నిలిచింది. దేశంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే బెంగళూరుది అగ్రస్థానం. దీనికంటే ముందు- భారత్ లోని మరే నగరం కూడా లేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి ఏఐ యూనివర్శిటీని స్థాపించబోతోన్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఏఐ హబ్ ను కూడా ఏర్పాటు చేయబోతోన్నామని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలను నిర్వహించడం, నూతన ఆవిష్కరణలను చేపట్టడం, దీన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఏర్పాటైన గూగుల్ ఐఓ కనెక్ట్ ఇండియా సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ప్రభుత్వంతో పాటు టెక్- పారిశ్రామిక, విద్యా వేత్తలు ఈ ఏఐ యూనివర్శిటీలో భాగస్వామ్యులు అవుతారని డీకే శివకుమార్ తెలిపారు. ఏఐ ఇంక్యుబేషన్ సెంటర్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్టప్ కంపెనీలు, ఇతర స్టేక్ హోల్డర్ల సహకారాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోన్నామని వివరించారు.
ఈ క్రమంలో కర్ణాటకను ఏఐ సొంత రాష్ట్రంగా అభివర్ణించారు డీకే శివకుమార్. ప్రభుత్వంలో ఇప్పటికే ఏఐని అడాప్ట్ చేసుకున్నామని, పథకాల అమలులో దీన్ని వినియోగిస్తోన్నామని గుర్తు చేశారు. ఏఐ వల్ల టీచర్లు మరింత మెరుగ్గా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించగలరని వ్యాఖ్యానించారు. రోగాలను గుర్తించడంలో డాక్టర్లకు ఏఐ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. రైతులు సైతం వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని దీనిద్వారా పొందగలరని పేర్కొన్నారు.
బెంగళూరులో ఇప్పటికే 17,000లకు పైగా స్టార్టప్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఉన్నాయని, దేశ ఐటీ ఎగుమతుల్లో 40 శాతం వాటా తమదేనని డీకే శివకుమార్ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణీకరణ, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యులు కావాలని గూగుల్ ప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. తమ రాష్ట్రం ఏఐలో విద్యార్థులు, రీసెర్చర్లకు అనేక అవకాశాలను కల్పిస్తోందని, ఏఐ పురోగమనంలో అగ్రగామిగా ఎదుగుతున్నామని అన్నారు.
బెంగళూరుతో పాటు తీరప్రాంతాల్లో అత్యాధునిక గ్రీన్ డేటా సెంటర్లను నిర్మిస్తున్నామని డీకే శివకుమార్ పేర్కొన్నారు. 'బియాండ్ బెంగళూరు' దార్శనికత ద్వారా, తమ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతిభావంతులైన యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందేలా చేస్తోన్నామని తెలిపారు. మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి- ధార్వాడ్, బెళగావి, కలబురగిలలో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.














Click it and Unblock the Notifications