హార్దిక్ పాండ్యా కమ్ బ్యాక్- ఆ కొరత తీరినట్టే.. !!
శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఇటీవలే జింబాబ్వే పర్యటనను దిగ్విజయంగా ముగించుకుంది. ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో చవి చూసిన పరిపూర్ణ ఓటముల గాయాన్ని జింబాబ్వే సిరీస్ కొంతవరకు నయం చేయగలిగింది. ఇక తన తదుపరి సిరీస్ కు సమాయాత్తమౌతోంది టీమిండియా. సెప్టెంబర్ లో మూడు టీ20 మ్యాచ్ లను ఆడబోతోంది.
ఈ సారి.. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనున్నాయి.. ఈ మూడు మ్యాచ్ లు కూడా. ఈ సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ లో భారత్ తో సిరీస్ కు ఆ దేశ జట్టు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ అధికారికంగా ప్రకటించాయి. మ్యాచ్ లకు అధికారికంగా ఆమోద ముద్ర వేశాయి.

ఆఫ్ఘనిస్తాన్ లో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితులు లేనందున.. తన హోమ్ సిరీస్ను భారత్ వేదికగా జరపాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్లానింగ్ లో భాగంగా ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 13వ తేదీన మొదటి మ్యాచ్ ఆరంభమౌతుంది. 15, 17 తేదీల్లో మిగిలిన రెండింటినీ నిర్వహిస్తారు. ఒకే స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్లు ఆడబోతోండటం పట్ల క్రేజ్ ఏర్పడింది.
ఈ సిరీస్ కు హార్దిక్ పాండ్యా ఆడటం ఖాయమైంది. గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వేల్లో జరిగిన టీ20 సిరీస్ లకు అందుబాటులో లేని ఈ ఆల్ రౌండర్ ఆఫ్ఘన్ తో మ్యాచ్ లకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులో బీసీసీఐకి చెందిన నేషనల్ క్రికెట్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ లో ఉంటోన్నాడు. దాదాపుగా వంద శాతం ఫిట్ నెస్ ను సాధించాడు. నెట్ ప్రాక్టీస్ లోనూ ముమ్మరంగా పాల్గొంటోన్నాడు.
అతని ఫిట్ నెస్ పై టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కుడి కాలి పిక్కల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెట్స్ లో 10 ఓవర్ల పాటు నిలకడగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. బ్యాటింగ్ పైనా పూర్తి దృష్టి సారించాడు. తనదైన శైలిలో షాట్లు ఆడగలుగుతున్నాడు. వర్క్ లోడ్ కు అనుగుణంగా తనను తాను మలచుకోగలుగుతున్నాడని ఈ కథనం పేర్కొంది.
హార్దిక్ పాండ్యా జట్టుకు అందుబాటులోకి రావడం వల్ల అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. బలపడినట్టవుతుంది. సరైన ప్లేయర్లు లేకపోవడం వల్ల ఐర్లాండ్ వంటి చిన్న జట్టు పైనా టీ20 సిరీస్ ను 0-2 తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది టీమిండియాకు. ఇంగ్లాండ్ లోనూ అదే పరిస్థితి. ఇక్కడా టీ20 సిరీస్ ను కోల్పోయింది. దీని తర్వాత జింబాబ్వేతో జరిగిన సిరీస్ ను 3-0 గెలుచుకోవడం కొంతలో కొంత ఊరట ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఆడబోతోండటం జట్టుకు నూతనోత్తేజాన్ని నింపేదే.














Click it and Unblock the Notifications