Gautam Gambhir: శ్రీలంక చేతిలో ఓడిపోతే గంభీర్ అవుట్ ? తేల్చేసిన బీసీసీఐ..!
గత ఏడాది కాలంగా టీమిండియాలో నిలకడ లోపించింది. ఒక సిరీస్ గెలిస్తే మరో రెండు సిరీస్ లు ఓడిపోవడం, ఓ మ్యాచ్ గెలిస్తే నాలుగు మ్యాచ్ లు ఓడిపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పదవి కోల్పోవడం ఖాయమని ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ మాత్రం వేచి చూసే ధోరణి కొనసాగిస్తోంది. తాజాగా జింబాబ్వే సిరీస్ లో గంభీర్ స్ధానంలో తాత్కాలిక కోచ్ గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించడంతో ఆయనపై అంచనాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కు తిరిగి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సిరీస్ లో భారత్ ఓటమి పాలైతే మాత్రం గంభీర్ ను సాగనంపేయడమే బెటర్ అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. ఇలాంటి తరుణంలో శ్రీలంకతో టెస్టు సిరీస్ ను భారత్ కోల్పోతే, గంభీర్ హెడ్ కోచ్ పదవి కోల్పోయినట్లేనన్న భావన పెరుగుతోంది. దీనిపై బీసీసీఐ తాజాగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెవ్ స్పోర్ట్జ్ (Revsportz) కథనం ప్రకారం శ్రీలంక చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయినా గౌతం గంభీర్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదని బీసీసీఐ వర్గాలు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

ఎందుకంటే రెడ్-బాల్ టీమ్ పరివర్తన దశలో ఉందని, ఒక పటిష్టమైన జట్టును తీర్చిదిద్దడానికి గంభీర్కు సమయం అవసరమని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఓటములు ఇలాగే కొనసాగితే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో, గంభీర్కు బీసీసీఐ నుంచి బలమైన మద్దతు కొనసాగుతోందని తెలుస్తోంది. జట్టులో ఒక కీలకమైన పరివర్తన దశను ఆయన పర్యవేక్షిస్తున్నందున తన కాంట్రాక్టులో మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది. అందుకే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తాత్కాలిక ప్రత్యామ్నాయాన్ని నియమించే అవకాశం లేదని సమాచారం. మరోవైపు, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో క్రికెట్ విభాగాధిపతిగా తన ప్రస్తుత పాత్రలో లక్ష్మణ్ మరింత సౌకర్యవంతంగా ఉన్నారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications