శ్రీవారి భక్తులకు అరుదైన అద్భుత అవకాశం- మళ్లీ దక్కేనా..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రావణ మాసం ఆరంభం.. వరుస సెలవులతో రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఈ నెలలోనే రెండు సార్లు తిరుమలలో అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఒకే నెలలో రెండు సార్లు ఈ గరుడ వాహన సేవ రావటం అరుదు.
తిరుమల శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం. ఈ నెల (ఆగస్టు) 17న తిరుమలలో గరుడ పంచమి నిర్వహించనున్నారు. గరుడ పంచమి సందర్భంగా ఆగస్టు 17వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీవారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. అయితే తిరుమలలో ఒకే నెలలో రెండుసార్లు గరుడ వాహనసేవ రావటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన ఘటనే ఈ నెలలో జరగనుంది. ఆగస్టు 28న శ్రావరణ పౌర్ణమి సందర్భంగా స్వామి వారు గరుడ వాహనంపై నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇలా ఒకటే నెలలో గరుడ పంచమి.. శ్రావణ పౌర్ణమి వేళ గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహించనుంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు.

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
గరుడ పంచమి సందర్భంగా కొత్త దంపతులు తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని, మహిళలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలంగా, మంచి వ్యక్తిత్వంతో ఉండాలిన గరుడ పంచమి పూజ చేస్తారు. అలాగే తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అదే విధంగా ఈ నెల 28వ తేదీన శ్రావణ పౌర్ణమి వేళ రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు సైతం రెండు సార్లు జరగనున్నాయి. ఇందు కోసం టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. కాగా.. భక్తులు మాడ వీధుల్లో ఎటువంటి ప్రత్యేక టిక్కెట్లు లేకుండానే స్వామివారి గరుడ వాహన సేవను ఉచితంగా వీక్షించవచ్చు.













Click it and Unblock the Notifications