అది లాస్ట్ ఓవర్ ఫస్ట్ బంతేనా: కిరణ్ వద్ద మరిన్నిబాల్స్?
హైదరాబాద్: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు ఉన్నాయట. రాష్ట్ర విభజనను ఆపేందుకు ఆయన ఇప్పుడు రాష్ట్రపతి భవన్ దిశగా అడుగులు వేయనున్నారట. తెలంగాణ ముసాయిదా బిల్లును శాసన సభ, శాసన మండలి తిరస్కరించిన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి.. బిల్లును అసెంబ్లీ తిరస్కరించినందున పార్లమెంటుకు పంపవద్దని కోరనున్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి తీర్మానంలో అది ఉంది. అయితే ఆయన స్వయంగా ప్రణబ్ను కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం కూడా ఉందట. ముఖ్యమంత్రికి సంబంధించి బిల్లు అసెంబ్లీను దాటడం చివరి ఓవర్లో తొలి బంతి మాత్రమేనట. మరో ఐదు బంతులున్నాయని సీమాంధ్ర నేతల అభిప్రాయం. అందుకే తిరస్కరణ బిల్లుపై వారు సంబరాలు చేసుకుంటున్నారంటున్నారు.

అసెంబ్లీలో తెలంగాణ బిల్లును తిరస్కరించడాన్ని కీలకమైన తొలి బంతిగా ఆయన సన్నిహితులు అభివర్ణిస్తున్నారు. ఇంకా ఢిల్లీలో దీక్ష, సుప్రీం కోర్టులో కేసు, రాజీనామా, రాష్ట్రపతిని కలవడం వంటి అనేక బంతులతో ముఖ్యమంత్రి సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు. బిల్లును వ్యతిరేకించడం ద్వారా కేంద్రంపై, రాష్ట్రపతిపై వత్తిడి పెంచే అవకాశాలు ఉంటాయని, రాష్ట్రపతి పునరాలోచనలో పడే అవకాశాలున్నాయని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు.
నాలుగైదు రోజుల్లో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీలో ముఖ్యమంత్రి దీక్ష చేస్తారని, అది ఆమరణ దీక్ష కాదని కేవలం శాంతి దీక్షగా మాత్రమే ఉంటుందంటున్నారు. శాసనసభలో తిరస్కరణ తీర్మానాన్ని జతపరచి రాష్ట్రపతికి లేఖ రాయడం, పార్లమెంట్లో చర్చ రాకుండా వత్తిడి చేయడం వంటివి కూడా ఆయన తన ప్రధాన ఆయుధాలుగా భావిస్తున్నారు. ఇక రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు వంటి అంశాలు చివరి బంతులుగా ఉంటాయని చెబుతున్నారు.
విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తే దీక్ష ముగిశాక సిఎం పదవికి కిరణ్ రాజీనామా చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. తద్వారా ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియకు కూడా అడ్డంకులు కలిగించే అవకాశాలుంటాయని, ఇది ఆర్థిక నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందంటున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం, సమైక్య రాష్ట్రం కోసం ఇచ్చిన అఫిడవిట్ల సాయంతో సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఆయన చివరి బంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications