బాబుకు సుబ్బిరామిరెడ్డి కితాబు: నన్ను అడగొద్దు, జగన్ పార్టీలోకి ఎలా వెళ్తా!
విజయవాడ: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి... చంద్రబాబు ప్రభుత్వంపై ప్రసంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లను మెచ్చుకుంటున్నానని చెప్పారు. మంగళవారం ఆయన పున్నమి ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు.
కాగా, సోమవారం నాడు ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ప్రజలకు మేలు కలిగే కొన్ని పనులు చేస్తానని తాను హామీ ఇచ్చానని, ఇది తన మంచి తనానికి నిదర్శనం అన్ారు. అయితే అందులో కొన్ని నెరవేరలేదని, దానికి తనను నిందించాల్సిన అవసరం లేదన్నారు.
తానుగా చేస్తానన్న పనులు ఎందుకు చేలేదని అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు. తాను ప్రజలను ఓట్లు అడిగి హామీలు ఇస్తే, అప్పుడు తనను నిందించే లేదా ప్రశ్నించే హక్కు ప్రజలకు, ఇతరులకు ఉందన్నారు. రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే తనకు ఢిల్లీలో చాలా పనులుంటాయన్నారు.
2020 వరకు తన రాజ్యసభ పదవీ కాలం ఉందన్నారు. 2019లో వేరే పార్టీ తరఫున పోటీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. టి సుబ్బిరామి రెడ్డి వైసిపిలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారనే వాదనలు వినిపించాయి. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు.
అయినా ఆ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అసలు పొగడ్తలకు పొంగిపోని మనిషి ఎవరూ ఉండరన్నారు. తాను ఇతరులను ఆనందంగా ఉంచుతానని, అందుకే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.