టీడీపీ-జనసేన సీట్ల ప్రకటన తర్వాత జరిగేది ఇదే ? కొడాలి నాని జోస్యం..!
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా సీట్లు కోల్పోతున్న పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు విపక్ష టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. టీడీపీ-జనసేన సీట్ల ప్రకటన తర్వాత ఏ జరగబోతోందో కొడాలి చెప్పేశారు.
వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వరుస వ్యాఖ్యలు, విమర్శపై మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు మతిభ్రమించి వైసీపీలో జరుగుతున్న సీట్ల మార్పులపై మాట్లాడుతున్నాడని కొడాలి విమర్శించారు. రా కదలిరా అంటూ కదిలి వెళ్తున్న చంద్రబాబు.. ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా తమ ఎమ్మెల్యేలు, మంత్రులను తిడుతున్నాడని కొడాలి ఫైర్ అయ్యారు.

2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ కు పార్శిల్ చేశారని కొడాలి నాని విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఆయన చేసేదేముందన్నారు. సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్ధులు, 25 మంది ఎంపీ అభ్యర్ధుల్ని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని కొడాలి వెల్లడించారు. అదే సమయంలో పీకేసిన ఐదారుగురు మాత్రమే చంద్రబాబు తీసిన తలుపుల లోపలికి వెళ్తున్నారని కొడాలి ఎద్దేవా చేశారు.
రేపు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఎవరెక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే సీట్లు రాని అభ్యర్ధులు ఆ పార్టీలనే తగులబెడతారని కొడాలి నాని జోస్యం చెప్పారు. కాబట్టి తలుపులు తీసి ఇతర పార్టీల వారిని ఆహ్వానించడం మాని, తమ కొంప కాలకుండా చూసుకోవాలని చంద్రబాబుకు కొడాలి హితవు పలికారు. చంద్రబాబు 600 హామీలిచ్చి అమలు చేయని క్రెడిబిలిటీ లేని నాయకుడని కొడాలి విమర్శించారు. ఈసారి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా కష్టమేనన్నారు.












Click it and Unblock the Notifications