శ్రీవారి సేవలో తమిళనాడు సీఎం: రోడ్డు మార్గంలో చడీచప్పుడు లేకుండా !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చెన్నై నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తన పదవికి ఎసరు రాకుండా చూడాలని పళనిసామి శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన సన్నిహితులు
తిరుమల/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి ఎడప్పాడి పళనిసామి తిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సోమవారం సాయంత్రం చెన్నై నుంచి ఎడప్పాడి పళనిసామి ఎలాంటి ఆర్బాటం లేకుండా రోడ్డుమార్గంలో తిరుమల బయలుదేరారు. ఈ సందర్బంగా తమిళనాడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో ఎడప్పాడి పళనిసామిని చెన్నై-తిరుపతి జాతీయరహదారిలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు (చిత్తూరు జిల్లా) వరకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో తిరుమల వరకు తీసుకు వెళ్లారు.

ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు !
తమిళనాడులో తన పరిపాలన ఉండాలని, ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఉండకూడదని ఇటీవల సీఎం ఎడప్పాడి పళనిసామి తన సొంత జిల్లా అయిన సేలంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. పన్నీర్ సెల్వం వర్గం నుంచి తన పదవికి ఎలాంటి అడ్డంకులురాకూడదని పళనిసామి తన కులదైవంకు పూజలు చేశారని తెలిసింది.

ఐటీ శాఖ లేఖతో ఉలిక్కిపడిన సీఎం
కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి నుంచి ముడుపులు (లంచం) తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల విషయంపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి లేఖ రాయడం తీవ్రచర్చకు దారితీసింది.

పెద్దల సూచనలతో తిరుమలకు సీఎం
తమిళనాడుకు చెందిన పలువురు పెద్దల సూచనల మేరకు సీఎం ఎడప్పాడి పళనిసామి తిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి ఎడప్పాడి పళనిసామి తిరుమల చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అన్నీ కష్టాలే, ఎలా చెయ్యాలి !
తనను సీఎం చేసిన శశికళ బెంగళూరు జైల్లో, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి (అమ్మ వర్గం) టీటీవీ దినకరన్ తీహార్ జైల్లో ఉండటంతో ఎడప్పాడి పళనిసామి ఆందోళనకు గురైనారని తెలిసింది. ఇదే సమయంలో స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

మొదటికే మోసం వస్తుందని ?
తమిళనాడు సీఎం పళనికిసామికి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ పెద్ద తలనొప్పిగా తయారైనాడని సమాచారం. ఆయన విషయంలో పళనిసామికి నిద్రపట్టడం లేదని తెలిసింది. మంత్రి పదవి నుంచి తప్పించడానికి టీటీవీ దినకరన్ అడ్డుపడటంతో పళనిసామి ఏ నిర్ణయం తీసుకోలేక ఇబ్బందిపడుతున్నారని తెలిసింది.

కాంట్రాక్టర్ ఆత్మహత్య
ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ కు సన్నిహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణ్యం అలియాస్ సుబ్రమణియన్ ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక మరేమైన కారణాలు ఉన్నాయా ? అని పోలీసులు ఆరా తీస్తున్న సమయంలో పళనిసామి చెన్నై వదిలి తిరుమల చేరుకున్నారు.

సీఎంకు అధికారులు స్వాగతం
తిరుమల చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత పళనిసామి కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. పళనిసామి కుటుంబ సభ్యులు బసచేసిన ప్రాంతంలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications