దేవినేని ఉమాకు బిగుస్తున్న ఉచ్చు: సీఎం జగన్ లెక్క పక్కా..నెక్ట్స్ అదేనా..?
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. టీడీపీ హయాంలో మంత్రులుగా ఉంటూ వారి శాఖల్లో జరిగిన అవినీతిలో వారి ప్రమేయం పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం. వారి ప్రమేయం ఏ మాత్రం ఉన్నట్లుగా ఆధారాలతో నిర్దారణ అయితే, చర్యలకు వెనుకాడకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను కార్మిక శాఖలో జరిగిన అవినీతిలో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ కేసు విచారణ సాగుతోంది.

రాజధాని భూముల వ్యవహారంలో...
రాజధాని భూముల వ్యవహారంలో అనేక మంది పేర్లు బయటకు వచ్చినా...న్యాయస్థానం ఆదేశాలతో వారి పైన చర్యలకు ప్రభుత్వం ముందుకు వెళ్లలేక పోయింది. తాజాగా అమరావతి భూముల వ్యవహారంలో మాజీ సీఆర్డీఏ కమిషనర్లను సీఐడి విచారించింది. అందులో మంత్రులు నారాయణ ప్రమేయం..ఆయన నిర్ణయాలనే తాము అమలు చేసినట్లు సీఐడీ ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. తాజాగా.. ఫైబర్ నెట్ లో రెండు వేలకు పైగా జరిగిన లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ప్రభుత్వం సీఐడి విచారణకు ఆదేశించింది. ఐటీ శాఖకు లోకేశ్ ప్రాతినిధ్యం వహించటంతో...పక్కా ఆధారాలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

పట్టిసీమలో అవినీతి జరిగిందంటూ..
స్కిల్ డెవలప్ మెంట్ పేరుతోనూ అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి తాజాగా నివేదికలు అందాయి. దీని పైన ప్రభుత్వం పూర్తి సమాచారం కోరినట్లు తెలుస్తోంది. ఇక, గత ప్రభుత్వం నీరు చెట్టు- పూడిక తీత పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత అందులో దాదాపుగా రెండు వేల కోట్లు దుర్వినియోగం చేసారంటూ సమాచారం సేకరించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు నీరు- చెట్టు పేరుతో జరిగిన అవినీతి విషయంతో పాటుగా పట్టిసీమలో అవినీతి జరిగిందనేది ప్రభుత్వ వాదన. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖా మంత్రిగా పని చేసిన దేవినేని ఉమా ను విచారించే అవకాశం కనిపిస్తోంది.

పుష్కరాల సమయంలో...
ఇప్పటికే ముఖ్యమంత్రి పైన వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో దేవినేని ఉమా కర్నూలు సీఐడి అధికారుల విచారణ ఎదుర్కొన్నారు. అయితే, విచారణ మినహా ఎటువంటి చర్యలు వద్దంటూ హైకోర్టు సీఐడీని ఆదేశించింది. అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ పైన అమరావతి భూముల వ్యవహారంలో పాటుగా మరో అంశం పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మున్సిపల్ - ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా పుష్కరాల సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందనే అంశం పైన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
Recommended Video

లోకేష్ పై కూడా విచారణ...
ఇక, గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి పైన చర్యల విషయంలో ముందుకే వెళ్లాలని సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో...గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఆ ఇద్దరికి ఉచ్చు బిగుసుకుంటోందని వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. దీంతో..రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ గత ప్రభుత్వంలో అవినీతి పైన ఆరోపణలు మినమా..ఏదీ నిరూపించలేకపోయిందనే విమర్శ ఉంది. దీంతో...ఆధారాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications