రణరంగంగా పద్మావతి యూనివర్సిటీ; కూటమి నేతల ఆందోళనలు, హై అలర్ట్, రంగంలోకి కేంద్రబలగాలు!!
తిరుపతిలో టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై దాడి ఘటన నేపథ్యంలో కూటమి శ్రేణులు భగ్గుమన్నాయి. తిరుపతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. టిడిపి అభ్యర్థి పులివర్తి నాని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతను పర్యవేక్షించి వస్తున్న క్రమంలో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఆయన పైన వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దాడిలో పులివర్తి నాని వాహనం ధ్వంసం కాగా, పులివర్తి నాని సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి.
పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన.. రంగంలోకి వైసీపీ
దీంతో పులివర్తి నాని అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక పులివర్తి నాని పై దాడి ఘటన నేపథ్యంలో తిరుపతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పద్మావతి మహిళా యూనివర్సిటీ ముందు బైఠాయించి టిడిపి శ్రేణులు, వారికి మద్దతుగా కూటమి పార్టీల శ్రేణులు నిరసన తెలుపుతున్న క్రమంలో వైసీపీ శ్రేణులు కూడా పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

మీడియా పైన కూడా లాఠీ చార్జ్ చేసిన పోలీసులు.. మీడియా ఆందోళన
పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఇరు వర్గాల వారిపై లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ ఝుళిపించారు. దీంతో మీడియా స్థానిక సీఐ దురుసు ప్రవర్తన నుండి నిరసిస్తూ ఆందోళనకు దిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా తయారయింది.
మారణాయుధాలతో స్ట్రాంగ్ రూమ్ వద్ద తిరుగుతుంటే ఏం చేస్తున్నారు
టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేంతవరకు టిడిపి శ్రేణులు తేల్చి చెప్తున్నారు. 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. నడవలూరు సర్పంచ్ గణపతి ఆధ్వర్యంలో దాడి జరిగిందని, స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో మారణాయుధాలతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి ఈ దాడులకు పాల్పడ్డాడని వారు ఆరోపిస్తున్నారు.
రణరంగంగా మారిన పద్మావతి యూనివర్సిటీ
దీనిని చెవిరెడ్డి పిరికిపంద చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. చెవి రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. పులివర్తి నాని పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసే వరకు అందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణం రణరంగంగా మారింది.
హై అలెర్ట్ .. రంగంలోకి కేంద్ర బలగాలు
భారీగా పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనలతో హై అలర్ట్ అయిన ఈసీ, కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. మరోవైపు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications