పవన్ కల్యాణ్..ఎవరి సొంతం?: టీడీపీ-బీజేపీ మధ్య పోటాపోటీ: తమ వాడిగా చెప్పుకొనే ప్రయత్నం
అమరావతి: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. రానా మరో హీరోగా నటించిన మల్టీ స్టారర్ మూవీ ఇది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో మల్టీ స్క్రీన్లలో ప్రదర్శితమౌతోంది. హిట్ టాక్ను సొంతం చేసుకుంది. సాగర్ కే చంద్ర దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- ఈ సినిమాకు స్క్రీన్ప్లే సమకూర్చారు. స్క్రీన్ప్లేతో మాయాజాలం చేశారాయన. మలయాళం సినిమాకు రీమేక్ అయినప్పటికీ..స్క్రీన్ప్లే వల్ల ఫ్రెష్నెస్ కనిపించిందని అభిమానులు చెబుతున్నారు.

అడ్డంకులు ఉన్నా..
ఈ మూవీ విడుదల కూడా వివాదాస్పదమైంది. బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలను ప్రదర్శించిన సినిమా థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలను తీసుకుంటామంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు కూడా.
తెలంగాణలో బెనిఫిట్ షోలతో పాటు అయిదో ఆటను ప్రదర్శించడానికీ అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇదివరకే జారీ చేసింది. ఇలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ.. మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.
బెనిఫిట్ షోలకు అనుమతి లేదు..
ఏపీలో భీమ్లా నాయక్ బెనిఫిట్ షోనకు అనుమతి ఇవ్వకపోడం పట్ల అభిమానులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్య వల్లే- ప్రభుత్వం పవన్ కల్యాణ్ నటించిన సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో నంబర్ 35ను జారీ చేసిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ధ్వజమెత్తుతున్నారు.
పవన్ కోసం పోటీ..
ఈ పరిణామాలన్నింటినీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. పవన్ కల్యాణ్ను తమ వాడిగా చెప్పుకొనే ప్రయత్నం చేసింది. భీమ్లా నాయక్ సినిమాకు ఎదురైన అడ్డంకులను అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంది. ఆయనపై ఘాటు విమర్శలను సంధించింది. పనిలో పనిగా భీమ్లా నాయక్ సినిమా అద్భుతమంటూ కితాబిచ్చింది. తాను ఆ సినిమాను చూడటానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడం- పరిస్థితికి అద్దం పడుతోంది.
చంద్రబాబు, పట్టాభి సైతం..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ సహా పలువురు టీడీపీ సీనియర్ నాయకులు భీమ్లా నాయక్ కోసం ట్వీట్లు చేశారు. రాజకీయపరమైన కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం దిగిదంటూ మండిపడ్డారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూరకంగా ఇబ్బందులకు గురి చేస్తోన్నారంటూ విమర్శించారు.
తగ్గేదేలేదంటోన్న బీజేపీ..
తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు కూడా ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తమ చేతి నుంచి జారిపోకూడదనే తపన వారిలో కనిపించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ట్వీట్ ఆసక్తి రేపింది. విజయవాడలో భీమ్లా నాయక్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూశానని చెప్పుకొన్నారు జీవీఎల్. సినిమా సక్సెస్ను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఆరోపించారు. అయినప్పటికీ భారీ విజయాన్ని సాధించి, షాకిచ్చిందని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి భీమ్లా నాయక్ని చూడమని ఆయన వైఎస్ జగన్కు సూచించారు.
Recommended Video

ఒకే సినిమాపై రెండు పార్టీలు..
ఒకే సినిమా.. ఒకే అంశంపై అటు టీడీపీ, ఇటు బీజేపీ పోటాపోటీగా ట్వీట్లు చేయడం, ఆ సినిమాకు రాజకీయ రంగు పులమడానికి వేరే కారణాలేవీ లేవు. భీమ్లా నాయక్ సినిమాపై సానుభూతిని చూపించడం, పవన్ కల్యాణ్ కంట్లో పడటం, ఆయనను తమవాడిగా చెప్పుకోవడం.. సినిమా టికెట్ల వివాదాన్ని అడ్డుగా పెట్టుకుని వైఎస్ జగన్పై విమర్శలను గుప్పించడం ఒక్కటే ఈ ట్వీట్ల వెనుక ఉన్న పరమార్థమని అంటున్నారు. ఇదివరకు అఖండ, పుష్ప, బంగర్రాజు సినిమాలు విడుదలైనప్పటికీ- ఆయా నాయకులెవరూ ఈ అంశాన్ని లేవనెత్తలేదని గుర్తు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications