టీడీపీ ఎదుట ఒక ప్రతిపాదన ఉంచిన బీజేపీ?
2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే అంత సులువేం కాదని ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షాకు తెలుసు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ వస్తోన్న ఈ ద్వయం తాజాగా ఏపీపై దృష్టిసారించింది. రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించడానికి ఇరుపార్టీల నేతలు నిరాకరిస్తున్నారు. ఎంపీ లక్ష్మణ్ మాత్రం అటువంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

2029లో ఏపీలో అధికారంలోకి రావాలి
ఏపీని మోడీ-షా ద్వయం 2029 లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా, జేపీ నడ్డా భేటీలు జరిపారు. జనసేనను విలీనం చేయాలంటూ పలుమార్లు ప్రతిపాదించినప్పటికీ పవన్ స్పందించకపోవడంతో అగ్ర నేతలు ఇతరత్రా మార్గాలను పరిశీలిస్తున్నారు.
ఏపీలో బీజేపీకి ఎంత బలం ఉందో ఆ పార్టీ నేతలకు తెలుసు. ఏ బలం లేని త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు ఏపీలో ఎందుకు ఏర్పాటు చేయలేమని వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాకుండా ముందుగా పునాది వేసుకోవడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉపయోగపడుతోందని భావిస్తున్నట్లు సమాచారం.

ఎంపీ సీట్లు మాకు.. ఎమ్మెల్యే సీట్లు మీకు
బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని ఏపీ నేతలు ప్రకటిస్తున్నప్పటికీ కేంద్ర అధినాయకత్వం ఆలోచనలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేసే పక్షంలో బీజేపీ పెద్దలు ఎంపీ సీట్లను తమకు వదిలిపెట్టాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 25 లోక్ సభ సీట్లున్నాయి.
గత ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ 3 స్థానాలను గెలుచుకోగలిగింది. రానున్న ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు బీజేపీకే కేటాయించాలని కోరినట్లు సమాచారం.

15 ఎంపీ సీట్లు అడుగుతున్న బీజేపీ?
బీజేపీకి కేంద్రంలో అధికారం దక్కాలంటే కావల్సింది ఎంపీ సీట్లు. దీంతో ఆ పార్టీ ఎంపీ సీట్లనే అడుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఎంపీ సీట్లకన్నా ఆయనకు ఎమ్మెల్యే సీట్లు సాధించడమే ప్రథమ ప్రాధాన్యం.
15 సీట్లు బీజేపీకి కేటాయించాలని, అలాగే అసెంబ్లీకి సంబంధించి తమకు ఇన్ని సీట్లు కావాలి అని పట్టుబట్టమని బీజేపీ నేతలు కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలేమైనా జరిగాయా? అనేదానికి టీడీపీవైపు నుంచి కానీ, బీజేపీవైపు నుంచి కానీ ఔననడంలేదు.. కాదనడంలేదు. వాస్తవమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలా లేదు.!












Click it and Unblock the Notifications