టీడీపీ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణలు-ఈసీకి విపక్ష నేతల ఫిర్యాదు- పోలీసు పరీక్ష వాయిదా ?
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తున్న వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చు రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా పలు అడ్డంకులు కల్పించిన వైసీపీ నేతలు.. చివరికి వారు దాఖలు చేసిన నామినేషన్లను సైతం రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరస్కరించేలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సంధర్బంగా నిన్న నామినేషన్ల దాఖలులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై టీడీపీ నేతలు ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి ఇవాళ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల ఎంపిక కోసం మార్చి 13న పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్టు పి.ఎం.టీ, పీఈటీ పరీక్షల కోసం ఉత్తర్వులు ఇచ్చిందని, వేల మంది పట్టభద్రులు ఈ పరీక్షకు హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు. వారందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లుగా తమ ఓటును నమోదు చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మార్చి 13న జరుగుతున్నాయని, దీంతో వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదు చేశారు. కాబట్టి పోలీసు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.

అలాగే నిన్నటి నామినేషన్ల పర్వంలో అనేక చోట్ల వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘించారని టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లాలోని పామూరులో గ్రామ వాలంటీర్ వచ్చి గ్రాడ్యుయేట్ ఓటర్ జాబితాను మండల వైసీపీ నాయకుల సమక్షంలో పరిశీలించారని, ఓటర్లపై ఒత్తిడి తేవాల్సిందిగా వైసీపీ నాయకులు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఆదేశించారని ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం , చిత్తూరు జిల్లాలలో ఎమ్మెల్సీ నామినేషన్లు స్వయానా మంత్రులు, వైసీపీ నాయకుల వాహనాలలో వారి అభ్యర్దులను కలెక్టర్ కార్యాలయానికి అనేక వాహనాలలో ఊరేగింపు వెళ్లి నామినేషన్లు వేశారన్నారు. వందలాది మంది వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లారన్నారు. దీనిని ప్రశ్నించే వ్యవస్ధ గానీ అడ్డుకోవాల్సిన పోలీసులు గానీ వారికి నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు.
స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ నామినేషన్ల విషయంలో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని, పంచాయితీరాజ్ ఛాంబర్ తరపున దాఖలు చేసిన నామినేషన్లను అక్రమంగా తిరస్కరించి వైసీపీ అభ్యర్దులను ఏకగ్రీవం చేశారన్నారు. కొన్ని చోట్ల ప్రతిపాదనలపై సంతకం చేసిన వారిని బెదిరించి సంతకాలు వారికి కావని బలవంతంగా వారి చేత ప్రకటనలు ఇప్పించారన్నారు. అటువంటి సందర్బంలో కూడా నామినేషన్లను తిరస్కరించి వైసీపీ అభ్యర్దులను ఏకగ్రీవం చేయడానికి వైసీపీ మంత్రులు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఈసీకి వారు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications