పవన్ కళ్యాణ్ కరెక్టే, జగన్ మాత్రం కాదు!: ఒకే సమస్యపై టిడిపి ఆలోచన
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఉన్నారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత మాత్రం రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ కర్నూలు యువభేరీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, జగన్ల మధ్య టిడిపి నేత బోండా ఉమమాహేశ్వర రావు పోలిక తెచ్చారు. ఇరువురు నేతలు కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నారు. జగన్ యువభేరీ సభలు నిర్వహిస్తుంటే, పవన్ బహిరంగ సభలు పెడుతున్నారు.

దీంతో బోండా ఉమ పోలిక తెచ్చారు. జగన్ రాజీనామా డ్రామాలకు తెర తీశారని మండిపడ్డారు. విభజన సమస్యలపై ఏనాడూ నోరు విప్పని జగన్, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే హోదాపై దొంగ నిరసనలు చేస్తున్నారన్నారు. హోదా అంశంపై పవన్ కళ్యాణ్ స్వలాభం కోసం కాకుండా చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారన్నారు.
2014 ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఏ సమస్య పైన నిలదీసినా టిడిపి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. పవన్ను, అలాగే, ఆయన సామాజిక వర్గాన్ని దూరం చేసుకునే ఆలోచన టిడిపికి లేనట్లుగా కనిపిస్తోంది. అందుకే పవన్ పట్ల సానుకూలంగా స్పందిస్తోంది.
ఏపీకి హోదా వద్దని మేం ఏమైనా చెప్పామా, లేక మా అధినేత చంద్రబాబు అన్నారా అని మంత్రి శిద్ధా రాఘవ రావు నిలదీశారు. తమకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్నారు. అందుకే ప్యాకేజీ తీసుకున్నామన్నారు.
చంద్రబాబు కుటుంబాన్ని కూడా వదిలి కూడా శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఒక ప్రణాళికతో ఆయన పడుతున్న శ్రమను చూసి పొరుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సైతం మెచ్చుకొంటున్నారన్నారు. అయితే ప్రతిపక్షనేతకు రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరంలేదన్నారు.
జగన్ ఎంపీలతో రాజీనామా చేయించినప్పుడు పోటీ గురించి ఆలోచిస్తామని ఇప్పుడే అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో రహదారి భద్రతకు పెద్దపీట వేస్తున్నామని రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు.












Click it and Unblock the Notifications