కొండపల్లి నగర పంచాయతీ టీడీపీ కైవసం-హోరాహోరీలో వైసీపీకి ఇండిపెండెంట్ షాక్
ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపులో వైసీపీ ప్రభంజనం కొనసాగుతున్న వేళ అక్కడక్కడా విపక్ష టీడీపీ విజయాలు నమోదు చేసుకుంటోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని కైవసం చేసుకున్న టీడీపీ... ఆ తర్వాత కృష్ణాజిల్లా కొండపల్లి నగర పంచాయతీని కూడా కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో టీడీపీ స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది.
కృష్ణాజిల్లాలోని శివారు ప్రాంతం కొండపల్లి నగర పంచాయతీగా ఏర్పాటైన తర్వాత తొలిసారి అక్కడ ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా పోరాడాయి. అధికార పార్టీ కావడంతో వైసీపీ ఇక్కడ కూడా గెలుస్తుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయి. మొత్తం 29 వార్డులున్న ఈ నగర పంచాయతీలో వైసీపీ, టీడీపీ ఇద్దరూ చెరో 14 సీట్లు సాధించారు. ఇండిపెండెంట్ కు ఓ సీటు దక్కింది. దీంతో చివరి నిమిషంలో లెక్కలు మారిపోయాయి.

వైసీపీ, టీడీపీకి సమాన సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇండిపెండెంట్ మద్దతు సాధించడంలో వైసీపీ విఫలమైంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్ధి శ్రీలక్ష్మి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు దీంతో టీడీపీ బలం 15కు పెరిగింది. స్ధానిక ఎంపీ కేశినేని నాని కో ఆప్షన్ ఓటు కూడా టీడీపీకే లభించనున్న నేపథ్యంలో ఆ బలం కాస్తా 16కు చేరింది. దీంతో 14 సీట్లకే పరిమితమైన వైసీపీకి నిరాశ ఎదురవుతోంది. దీంతో వైసీపీ అధికారం కోసం ప్రలోభాలకు దిగుతుందన్న అంచనాలూ లేకపోలేదు.
కొండపల్లి నగర పంచాయతీలో మొత్తం 29 వార్డులు ఉండగా.. అందులో వైసీపీ 1, 2, 3, 5, 7, 8, 9, 11, 14, 19, 23, 26, 27, 28 వార్డుల్ని గెల్చుకుంది. అలాగే టిడిపి 4, 6, 12,13, 15, 16, 17, 18, 20, 21, 22, 24, 25, 29 వార్డుల్ని గెల్చుకుంది. ఇండిపెండెంట్ శ్రీలక్ష్మి మరో స్ధానంలో గెలుపొందారు.












Click it and Unblock the Notifications