కొడాలి నాని అడ్డాలో చంద్రబాబు పాదయాత్ర - టీడీపీలో చేరికలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి మూడురోజులపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు గుడివాడలో రోడ్ షో..సభ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే క్రమంలో చంద్రబాబు పర్యటన కీలకం కానుంది. అదే సమయంలో జిల్లాలోని గన్నవరం..గుడివాడ పైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉంది. దీంతో..గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర పర్యటనపైన ఆసక్తి నెలకొంది.
గుడివాడలో చంద్రబాబు రోడ్ షో : నేటి నుంచి చంద్రబాబు మూడు రోజుల కృష్ణా జిల్లా పర్యటన ప్రారంభం కానుంది. పలు రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 12న నూజివీడులో రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ 13వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల తరువాత చంద్రబాబు నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొటారు. అక్కడ నుంచి బస్ స్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగుతుంది. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. గుడివాడలోని వీకేఆర్, కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. గుడివాడలో కొంత కాలంగా కొడాలి నాని వర్సస్ టీడీపీ రాజకీయం ఇప్పుడు చంద్రబాబు పర్యటనతో కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు : ఈ రోజు జిల్లాలో పర్యటన ప్రారంభం వేళ ముందుగా విజయవాడ లో జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు పొల్గొంటారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ నాయకత్వంలో పలువురు స్థానిక వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు ఉన్నాయి. చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరనున్నారు. ఆ తరువాత మచిలీపట్నం చేరుకుంటారు. రామానాయుడు పేటలోని వెంకటేశ్వర స్వామి వారిని చంద్రబాబు దర్శించుకుంటారు. అక్కడ నుంచి మచిలీపట్టణంలోని హిందూ కాలేజీకి చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి చంద్రబాబు పామర్రు మండలంలోని నిమ్మకూరుకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చంద్రబాబుకు బస ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీ వర్సస్ కొడాలి నాని :
రేపు గుడివాడలో చంద్రబాబు పర్యటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది. నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొనున్న చంద్రబాబు అక్కడి నుంచి గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో టీడీపీ తరపున అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ ఇప్పటికే రావి వేంకటేశ్వర రావు, ఎన్నారై రాము మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. వీరిలో ఎవరి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. అదే సమయంలో మచిలీపట్నం సభలో బందరు పోర్టుకు సంబంధించి చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావిస్తారని సమాచారం. మొత్తంగా చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన రాకీయంగా ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications