ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి ఓటమి తప్పదు?
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 175 నియోజకవర్గాల్లోను గుండు సున్నా వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఒటమి తపపదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజల నుంచి ఎన్నడూ చూడని స్పందనను కర్నూలు జిల్లా పర్యటనలో చూశానన్నారు. యువత, ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పారు. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను చూసిన తర్వాతే వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని, వెంటనే 8 జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారన్నారు.
ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటామని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు. ప్రత్యేకమైన పరిమితులేమీ లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ఆక్వా రంగంలో జోన్, నాన్ జోన్ విధానాలకు స్వస్తి పలుకుతామని, సీడ్ ధరల్ని నియంత్రిస్తామని, నీటి పన్ను, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటును పాత ధరలతోనే అమలు చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వీటన్నింటినీ పొందుపరుస్తామని చెప్పారు