చంద్రబాబు హెలికాప్టర్ రూట్ క్లిష్టం!
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మాచర్ల పర్యటన రద్దయింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో మాచర్ల ఎయిర్ రూట్ క్లిష్టంగా ఉందని పైలట్లు తెలిపారు. అటవీ ప్రాంతం మీదగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రయాణాన్ని సాగించలేమని చెప్పడంతో చంద్రబాబు మాచర్ల పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబునాయుడు మాచర్ల వెళ్లి అక్కడ సభ అయిన తర్వాత ఒంగోలు వెళ్లాలి.
బ్రహ్మానందరెడ్డిని గెలిపించండి
ఒంగోలు వెళ్లాలన్నా రూట్ డైవర్షన్ తీసుకుంటేనే సాధ్యమని చెప్పారు. దీంతో నేరుగా ఒంగోలు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఒంగోలుకు హెలికాప్టర్ లో వెళ్లారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంవల్ల మాచర్ల సభ రద్దయిందని, ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. మాచర్ల వచ్చేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా వీలుపడలేదని, కూటమి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పల్నాడు ప్రజలు విజ్ఞత కలవారని, రౌడీయిజానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు.

11తో ముగుస్తున్న ప్రచారం
ఈనెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. 11వ తేదీ రాత్రి 10.00 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ప్రధాన పార్టీలన్నీ దాదాపుగా రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన జరిపాయి. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన సభల్లో ప్రధాన నేతలంతా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల నుంచి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నుంచి, జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నిక ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోను పవన్ కల్యాణ్ ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. వారి వ్యూహాలను ధీటుగా ఎదుర్కొంటూ పవన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపు నియోజకవర్గం మొత్తం రోడ్ షో నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications