జగన్ అమరావతి ద్రోహి- జనం కన్నెర్ర చేస్తే తాడేపల్లి వీడాల్సిందే- గుంటూరులో చంద్రబాబు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత ఇవాళ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గుంటూరు నగరంలో పలు రోడ్షోల్లో పాల్గొంటున్న చంద్రబాబు.. సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. అమరావతి ద్రోహి, జనం కన్నెర్ర చేస్తే నువ్వు తాడేపల్లి వదిలి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ప్రజలు ఈసారి వైసీపికి ఓటేస్తే ఇక వారిని ఎవ్వరూ కాపాడలేరని, ఇవే చివరి ఎన్నికలు అవుతాయని చంద్రబాబు తెలిపారు. ముస్లింలు వైసీపీ ట్రాప్లో పడటం వల్లే రంజాన్ తోఫా, పెళ్లి కానుకతో పాటు ఇతర పథకాలు కోల్పోయారన్నారు.
ముస్లింలకు సంక్షేమ పథకాలేవీ ?
గుంటూరులో టీడీపీ, సీపీఐ అభ్యర్ధుల తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు... నగరంలో పలు చోట్ల రోడ్షోలు నిర్వహించారు. ఇందులో ఆయన గత టీడీపీ హయాంలో తాము ఇచ్చిన రంజాన్ తోఫా, పెళ్లి కానుక, ఇమామ్, మౌజన్లకు జీతాలు ఇప్పుడెక్కడున్నాయని ప్రశ్నించారు. ఎన్సార్సీ విషయంలో వైసీపీ ప్రభుత్వం నేరుగా మాట్లాడలేని పరిస్ధితుల్లో ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ముస్లింలను మోసం చేసేందుకు మరోసారి వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని, దీనికి అడ్డుకట్ట పడాలంటే టీడీపీ తరఫున నిలబెట్టిన ముస్లిం అభ్యర్ధులకు ఓట్లేయాలని చంద్రబాబు కోరారు.
అమరావతి ద్రోహి జగన్
గుంటూరు ఎన్నికల ప్రచారంలో మూడు రాజధానుల అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. సీఎం జగన్ అమరావతి ద్రోహి అని, గుంటూరు ద్రోహి అని, మీ పొట్ట కొట్టిన జగన్కు ఓటేస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గుంటూరు ఎమ్మెల్యే గుట్కా తయారు చేస్తాడని, మీరు తినాలి, చావాలి, ఆయన డబ్బులు సంపాదించుకుంటాడన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే ముస్తఫా బయట తిరిగి అందరికీ అంటించాడని గుర్తుచేశారు.
10 రూపాయల సంక్షేమం ఇచ్చి 100 లాగేస్తున్నారంటూ
వైసీపీ పాలనలో ప్రజలకు పది రూపాయల సంక్షేమం ఇచ్చి వారి నుంచి వంద రూపాయలు వివిధ రూపాల్లో లాగేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే రేపు పెట్రోల్ వంద రూపాయల నుంచి 200 అవుతుందని, చింతపండు వంద నుంచి మూడొందలు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. మద్యం వెయ్యి రూపాయలవుతుందన్నారు. సొంత తయారీలో బూమ్బూమ్, స్పెషల్ స్టేటస్ వంటి బ్రాండ్లు తీసుకొచ్చారని జగన్ సర్కార్పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తాను ప్రజల్ని అప్రమత్తం చేయడానికే వచ్చానని, ఓట్ల కోసం కాదన్నారు. ఓటేయకపోతే పించన్ ఇవ్వం, రేషన్ ఇవ్వం, అమ్మఒడి ఇవ్వమని బెదిరిస్తున్నారను, వారి తాత సొత్తా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి కన్నెర్ర చేస్తే జగన్ తాడేపల్లి వీడాల్సిందే
గుంటూరు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్పైనా చంద్రబాబు నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. నీలాంటి సీఎంలను చాలా మందిని చూశానని, ప్రజలు కన్నెర్ర చేస్తే తాడేపల్లి నుంచి పారిపోతావని జగన్ను హెచ్చరించారు. ఒకప్పుడు రాష్ట్రంలో రౌడీలు, తీవ్రవాదుల్ని తరిమికొట్టామని, ఇప్పుడు వైసీపీ తమకో లెక్క కాదని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలు తోక తిప్పిటే కట్ చేస్తామంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.
వైసీపీ గెలిస్తే మీకివే చివరి ఎన్నికలు
గుంటూరులో వైసీపీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలవుతాయంటూ చంద్రబాబు హెచ్చరించారు. మాచర్లలో రౌడీ షీటర్ను గెలిపించారని, రేపు వైసీపీ గెలిస్తే ఇక్కడా అదే జరుగుతుందన్నారు. ఇంటిపన్నులు పెరగడం ఖాయం, అన్నింటిపైనా పన్నులు వేస్తారని బాబు తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగి వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తులో అన్నీ కష్టాలేనన్నారు. నేను చేసే పోరాటానికి శక్తి ఇవ్వాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్నా అంటూ చంద్రబాబు ప్రసంగం ముగించారు.