సరస్వతికి సీఎం జగన్ ప్రాధాన్యం.. డబుల్‘ఆర్’తో విధ్వంసం.. లేవకుండా ‘లా’తో కొడతానంటూ..
''ఒక్కటి మాత్రం నిజం.. టీడీపీ హయాంలో కంటే.. వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగింది. దాంతోపాటే అవినీతి, అరాచకాలూ పెచ్చుమీరాయి. కానీ అభివృద్ధి శూన్యం. పాలన చేతగాక.. ఉన్నత న్యాయస్థానాలను సైతం ధిక్కరిస్తూ.. సొంత ప్రయోజనాలు, కక్ష సాధింపులు రాష్ట్రానికి ఏ విధంగా కీడు చేశాయో ఇది చదివితే తెలుస్తుంది..'' అంటూ ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సర్కారుపై పోరాటంలో గేరు మార్చిన ఆయన.. లేఖలో సంచలన విషయాలను బటయటపెట్టారు.
సీఎం జగన్ కు కేంద్రం షాక్ ఇందుకే..జైల్లోనే డిసైడయ్యారు.. వైసీపీలో కులవివక్షపై టీడీపీ స్క్రీన్ షాట్స్
రూ.100 కోట్లకు కొన్నారు..
కొద్ది గంటల కిందటే టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు.. అంతకుముందు ఎమ్మెల్సీలు శమంతకమణి, పోతుల సునీత సీఎం జగన్ సమక్షంలో పార్టీ మారగా.. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం తదితరులు అనధికారికంగా వైసీపీలో చేరిన తీరును చంద్రబాబు తప్పుపట్టారు. ఫిరాయింపుదారుల్లో ఒకరికి రూ.100 కోట్ల జరిమానా రాయితీ కల్పిస్తామని, మిగతా వాళ్లకు మైన్స్ కేటాయిస్తామని, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తామని, వ్యాపారాలకు రాయితీలు ఇస్తామని వైసీపీ ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టంపై ఉపన్యాసాలు దంచిన జగన్ ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించారు.
సరస్వతిపై దుమారం..
సీఎం జగన్ వ్యాపార సామ్రాజ్యానికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీకి ఇటీవల సున్నపురాయి గనుల లీజులు 50 ఏళ్లకు పొడగించడం, కృష్ణా జలాలను కేటాయించడంపై ప్రతిపక్ష నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. సరస్వతి కంపెనీ అక్రమాలకు పాల్పడుతోందనే ఆరోపణలపై 30 ఏళ్ల లీజును నాటి చంద్రబాబు సర్కారు రద్దు చేయగా.. జగన్ సీఎం అయిన ఏడాదిలోపే పాత ఆదేశాలను కొట్టేస్తూ, లీజును ఏకంగా 50 ఏళ్లకు పెంచేశారు. ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందని మంత్రులు స్పష్టం చేసినా.. సొంత కంపెనీ సరస్వతికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రజా సమస్యల పరిష్కారానికి చూపకపోవడం జగన్ అసలు నైజానికి అద్దం పడుతున్నదని టీడీపీ చీఫ్ విమ్శించారు.
కుంభకోణాల చిట్టాతో చంద్రబాబు సంచలనం.. చేపల చెరువుకు కొంగల కాపలా.. జగన్పై నిప్పులు..
రూ.87వేల కోట్ల అప్పులు..
టీడీపీ హయాంలో ప్రారంభమైన పథకాలను రద్దు చేసిన జగన్ సర్కారు అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని, కరోనా ఉపశమన చర్చల్లోనూ ఘోరంగా ఫెయిలైందని, ప్రతి పేద కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలన్న డిమాండ్ ను గాలికొదిలేశారని, మొత్తంగా ప్రజలపై రూ.50 వేల కోట్ల భారాన్ని మోపి, కొత్తగా రూ.87వేల కోట్ల అప్పులు చేశారని, ఇది సరిపోదన్నట్లు కరెంటు బిల్లులు, మద్యం, ఇసుక, సిమెంట్ ధరల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని బాబు తెలిపారు. వైసీపీ బెదిరింపులకు భయపడి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకురాకపోగా, ఉన్న కంపెనీలు వేరే ప్రాంతాలకు వెళ్లేపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
9 హత్యలు.. 7 ఆత్మహత్యలు..
కోడెల శివప్రసాద్ లాంటి సాహస నాయకుల దగ్గర్నుంచి సాధారణ కార్యకర్తదాకా టీడీపీకి చెందిన మొత్తం తొమ్మిది మందిని వైసీపీ సర్కారు హత్య చేయించిందని, తప్పుడు కేసులు బనాయించి మరో ఏడుగుర్ని ఆత్మహత్యలకు పురిగొల్పారని, 56 మంది ఆస్తుల్ని ధ్వసం చేసి, 167 మందిపై వేధింపులక పాల్పడ్డారని, 95 మందిపై అక్రమ కేసులు బనాయించారని, టీడీపీ సానుభూతిపరులైనందుకు వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారరి, సోషల్ మీడియా కార్యకర్తలపైనా కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
రాజారెడ్డి రాజ్యంగం..
టీడీపీ హయాంలో సృష్టించిన సంపదను వైసీపీ నేతలు నాశనం చేశారని, ప్రభుత్వ భవనాలకు రంగులు, ఎన్నికల కమిషనర్ తొలగింపు, తెలుగు బోధన రద్దు, శాసన మండలి రద్దు, మూడు రాజధానులు, ప్రజావేదిక కూల్చివేత తదితర పనుల్నీ జగన్ తుగ్లక్ చర్యలని, కాబట్టే ప్రజలతోపాటు ఉన్నత న్యాయస్థానాలు కూడా వాటిని వ్యతిరేకించిందని, చివరికి కోర్టులకు కూడా దురుద్దేశాలను ఆపాదించే దుస్థితికి జగన్ దిగజారిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి 4 మూలస్తంభాలైన లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, జ్యూడీషియరీ, మీడియాను కూలదోసి.. ఏకంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసి.. జగన్ తన సొంతదైన ‘రాజారెడ్డి రాజ్యాంగం(డబుల్ ఆర్)' అమలు చేస్తూ ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారంటూ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గేరు మార్చిన బాబు..
వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తానన్న చంద్రబాబు.. ఆక్రమంలో మరింత స్పీడు అందుకునేలా గేరు మార్చారు. జగన్ మళ్లీ కోలుకోకుండా ‘రూల్ ఆఫ్ లా' ఆయుధంగా వాడుకుంటానని స్పష్టం చేశారు. ‘‘ప్రతీకారేచ్ఛ గలవాడు పాలనకు అయోగ్యుడు. సానుకూల స్వభావమే వ్యక్తికి, సమాజానికి ప్రయోజనం. అత్యున్నత పదవిలో ఉన్నవాళ్ల కక్ష సాధింపు ధోరణి సమాజానికి చేటు చేస్తుంది. ఈ దుర్మార్గ ప్రభుత్వంపై ఏడాది కాలంగా టీడీపీ చేస్తోన్న పోరాటంలో సహకరించిన అందరికీ అభినందనలు. ఏపీని కాపాడుకునేందుకు రాబోయేరోజుల్లోనూ మీరంతా ఒక్కటి కావాలి'' అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.