గడపగపడకు ప్రభుత్వం పోటీగా టీడీపీ "ఇదేం కర్మ" - పొత్తులపై నేడు క్లారిటీ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఈ మూడున్నారేళ్ల కాలంలో చేసిన సంక్షేమాన్ని ప్రతీ ఇంటికి వివరిస్తూ గడపగడపకు ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్ గా టీడీపీ కొత్త కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించనుంది. రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు..ప్రభుత్వం చేసిన అప్పులు .. వైసీపీ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు "ఇదేం కర్మ" పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

వైసీపీ టార్గెట్ గా "ఇదేం కర్మ"
ప్రతీ ఇంటికి పార్టీ నేతలు - కార్యకర్తలు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. పెరిగిన ధరలకు నిరసనగా ఇప్పటికే టీడీపీ బాదుడే బాదుడు నిర్వహిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా పలు జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు "ఇదేం కర్మ" కార్యక్రమం ద్వారా మరింత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వివరించాలని టీడీపీ భావిస్తోంది. 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయితో పాటుగా నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పైన ప్రజల్లో చర్చ జరిగేలా చూడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పార్టీ నేతలు చెబుతున్నారు.

పార్టీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రసంగం
ఈ కార్యక్రమ నిర్వహణ పైన ఈ రోజు జరిగే పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో పార్టీ నేతలంతా హాజరయ్యే ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో పొత్తుల అంశం పైన పార్టీ అధినేత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జనసేన - టీడీపీ మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో, ప్రధానితో భేటీ తరువాత పవన్ లో మార్పు వచ్చిందనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో.. టీడీపీ పొత్తుల పైన వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తూ..ఒంటిరి పోటీకైనా సిద్దపడేలా పార్టీ శ్రేణులను సిద్దం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల నాటికి అందరిని కలుపుకొని ముందుకొస్తామని.. ఓట్లు వేయటం మీ ఇష్టమంటూ కర్నూలు రోడ్ షో లో స్పష్టత ఇచ్చారు.

పొత్తులపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్
అటు జనసేన నేతలు సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ఇప్పటికీ చెబుతున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ - బీజేపీ పొత్తు పైన కమలం పార్టీ నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పొత్తుల ఆధారంగా టికెట్లు దక్కేదీ లేనిదీ స్పష్టత కోసం నియోజకవర్గాల్లో నేతలు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే నియోజవకర్గ ఇంఛార్జ్ లుగా ఉన్న వారంతా ఈ పొత్తు ఖరారు నిర్ణయం పైన ఆసక్తిగా ఉన్నారు. ఈ రోజున పార్టీ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఇక నుంచి పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం పని చేసే దిశగా ఈ సమావేశం జరగనుంది.












Click it and Unblock the Notifications