ఏపీ ప్రభుత్వానికి షాక్ : అమరావతిలో సొంత పార్టీల నేత ధర్నా
విజయవాడ : ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు నిరసన గళం వినిపించడం ఎక్కడైనా కామనే. కానీ అమరావతి కేంద్రంగా జరుగుతోన్న ఏపీ పాలిటిక్స్ లో రొటీన్ కు భిన్నంగా.. కొత్తరకం పాలిటిక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏకంగా.. అధికార పార్టీ నేతలే ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు.
తాజాగా అమరావతికి సమీపంలోని పెనుమాక గ్రామానికి చెందిన టీడీపీ నేతలంతా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా.. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం మీదుగా కొత్త రహదారిని నిర్మిస్తున్నారు అధికారులు. ఇందుకోసం పాత రోడ్డును తవ్వి కొత్త రహదారి కోసం పనులు ప్రారంభించారు.
అయితే రోజులు గడుస్తున్నా.. పనులన్నీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడంతో.. కోపోద్రిక్తులైన స్థానిక టీడీపీ నేతలు గ్రామస్తులతో కలిసి రోడ్డెక్కి నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రోడ్డును విస్తరణ కోసం పాత రోడ్డును తవ్వి రోజులు గడుస్తూనే ఉన్నా.. నిర్మాణ పనులు మాత్రం ముందుకు కదలడం లేదని విమర్శించారు.
స్థానిక టీడీపీ నేతలు చేపట్టిన ఈ ధర్నాలో పెనుమాక గ్రామ టీడీపీ కార్యకర్తలంతా పాల్గొన్నట్లు తెలుస్తోంది. విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో.. ఒకింత షాక్ కు గురయ్యారట. దీంతో ఆందోళన చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటారా! అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.