TDP: KGF-2, RRR సినిమాలతో మహానాడుకు సంబంధమేంటి?
ఒంగోలు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. అసంఖ్యాకంగా తరలివచ్చిన కార్యకర్తలతో నేతల్లో జోష్ పెరిగింది. వాస్తవానికి అడుగడుగునా ప్రభుత్వం మహానాడుకు అడ్డంకులు సృష్టించిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీలు పీకేశారని, జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు ఒంగోలు తరలిరాకుండా ఉండటానికి ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా ఉండటం, రవాణాశాఖ ద్వారా ఎవరినీ టీడీపీ వారికి వాహనాలివ్వకుండా ఉండేలా చూడటం లాంటివి చేశారంటూ నేతలు మొదటి నుంచి మండిపడుతూనే ఉన్నారు.

ఈ రెండింటికీ మించి మహానాడు సూపర్హిట్?
KGF-2, RRR సినిమాలతో తెలుగుదేశం నాయకులు మహానాడును పోలుస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ రెండు సినిమాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలను సాధించడంతోపాటు కాసుల వర్షాన్ని కూడా కురిపించాయి. ఈ రెండు సినిమాలంతటిస్థాయిలో ఒంగోలు మహానాడు సూపర్హిట్ అయిందంటూ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నా పట్టుదలగా ప్రజలు కూడా తరలిరావడం పార్టీమీద వారికున్న అభిమానాన్ని, ప్రభుత్వం మీద వారికున్న కసిని తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంక్షోభం నుంచి అధికారం దిశగా..
వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడంతోపాటు ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం చేసిందని, దీనివల్ల సంక్షోభానికి గురైన తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు పెద్ద ఊరట లాంటిదని అభివర్ణిస్తున్నారు. కరోనా వల్ల వర్చువల్గా మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమం మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రజల మధ్య జరుగుతుండటంతో నాయకులు, కార్యకర్తలందరూ భారీగా తరలివచ్చారు. తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు తరలిరావడం ఆశ్చర్యం కలిగించింది.

ఎన్నెన్నో అడ్డంకులు.. అయినా విజయవంతం
మెప్మా ఆధ్వర్యంలో జాతీయ రుతుస్రావ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డ్వాక్రా మహిళలంతా కచ్చితంగా హాజరుకావాలంటూ అధికారులు ఆదేశాలు జారీచేయడంపై మహిళలు మండిపడ్డారు. మహానాడుకు వెళ్లకుండా ఉండేందుకే ఇలా చేశారంటూ ఆరోపించారు.
ఉదయం 11.00 గంటలకు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2.00 గంటల వరకు కూడా ప్రారంభం కాలేదంటే కేవలం మహానాడుకు ప్రజలు వెళ్లకుండా అడ్డుకోవడమేనని పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. అధికార వైసీపీ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మహానాడును విజయవంతం చేసినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications