వవన్ డెసిషన్ - టీడీపీలో వైబ్రేషన్స్ : ఫాలో అయ్యే విషయంలో భిన్నాభిప్రాయాలు : వైసీపీకి మేలు చేస్తుందంటూ..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ సమర్ధత సరిపోక తాను రోడ్డు మీదకు వచ్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ వర్సస్ జగన్ వ్యవహారం ఎంత ముదిరితే అంత తమకు రాజకీయంగా లాభం చేస్తుందనే లెక్కల్లో టీడీపీ కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రభావం పరోక్షంగా టీడీపీ పైన పడింది. తమ మిత్రపక్షం బీజేపీ కాదని..జనసేన అధినేత తాము బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయటం లేదని తేల్చి చెప్పారు. కానీ, బీజేపి మాత్రం పోటీ వైపు మొగ్గు చూపుతోంది.
ఈ సాయంత్రం బద్వేలు బీజేపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే పేరు ప్రకటించేందుకు రంగం సిద్దమైంది. 2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి వైసీపీ అభ్యర్ధి వెంకట సుబ్బయ్య గెలుపొందారు. ఆయన మరణంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అయితే, సిట్టింగ్ స్థానంలో వైసీపీ తమ అభ్యర్ధి ఎవరనేది ఖరారు చేయకముందే..గతం కంటే భిన్నంగా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్దిని ఖరారు చేసారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బద్వేలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజశేఖర్ నే తిరిగి అక్కడ నలిబెట్టాలని నిర్ణయించారు.
దీంతో..అప్పటి వరకు పోటీకి సిద్దంగా లేని వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులను తెర మీదకు తీసుకొచ్చి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే వెంకట సుబ్బయ్య సతీమణి సుధను వైసీపీ తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ఆ వెంటనే సాంప్రదాయాల ప్రకారం ఏకగ్రీవానికి సహకరించాలంటూ ప్రతిపక్షాలకు వైసీపీ పిలుపునిచ్చింది. కానీ, టీడీపీ స్పందించలేదు. కారణాలు ఏవైనా జనసేన అధినేత పవన్ బద్వేలు ఉప ఎన్నికలో మాత్రం తాము పోటీ చేయటం లేదని..విలువలకు పట్టం కడుతూ ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ ప్రకటించారు.

దీంతో..పవన్ అటు జగన్ పైన అంతగా ఫైట్ చేస్తూ అభ్యర్ధిని పోటీలో పెట్టకుండా విలువల గురించి ప్రస్తావించటంతో ఇప్పుడు టీడీపీలో చర్చ మొదలైంది. టీడీపీ సాంప్రదాయాలకు విలువ ఇచ్చే పార్టీగా ప్రచారం చేసుకొనే తాము..సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు సీటు ఇచ్చిన సమయంలో పోటీకి పెట్టటం సరి కాదనే వాదన కొందరు తెర మీదకు తెస్తున్నారు. 2014 లో నందిగామ నుండి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మరణిస్తే..ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన కుమార్తె సౌమ్యను బరిలో దింపారు.
అయినా.. వైసీపీ పోటీ పెట్టలేదు. ఇక, ఇప్పుడు పవన్ పోటీకి దూరంగా ఉన్న సమయంలో తాము పోటీ చేయటం కంటే దూరంగా ఉండి సానుభూతి దక్కించుకుంటే మంచిదని కొందరు సీనియర్లు అధినేతకు సూచిస్తున్నట్లుగా సమాచారం. అయితే, బీజేపీ - కాంగ్రెస్ పోట లో ఉన్న సమయంలో ఏకగ్రీవం జరిగే అవకాశం లేదని..ఇప్పటికే పార్టీ అభ్యర్ధిని ప్రకటించి..నిర్ణయం మార్చుకోవటం సరి కాదనే అభిప్రాయం మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోటీ నుంచి విత్ డ్రా అవుతే అది వైసీపీకి మేలు చేస్తుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. దీంతో..ఇప్పుుడు చంద్రబాబు దీని పైన ఏ విధమైన తుది నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications