వైసీపీలో జోష్ పెంచిన చంద్రబాబు: డబుల్ హ్యాపీ
TDP Janasena alliance: తెలుగుదేశం- జనసేన సీట్ల పంపకాల వ్యవహారంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ఘాటు విమర్శలు చేశారు. ఏ ప్రాతిపదికన పవన్ కల్యాణ్ 24 నియోజకవర్గాలకే తల ఊపారో స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీని వెనుక ప్యాకేజీలు పని చేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు.
ఎవరితో పొత్తుపెట్టుకోవాలో, ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా తెలియని దుస్థితిలో జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ ఉన్నారని రోజా విమర్శించారు. టీడీపీ- జనసేన ఉమ్మడి జాబితా తరువాత తాము 175 స్థానాలకు 175 గెలుస్తామనే ధీమా మరింత బలపడిందని, వైసీపీ క్యాడర్లో జోష్ పెరిగిందని, డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు.

ఈ లిస్ట్ చూశాక.. అసలు పవన్కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కూడా అర్ధం కావట్లేదని రోజా వ్యాఖ్యానించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం అయోమయంలో ఉన్నారని అన్నారు. కనీసం పావలా శాతం సీట్లను కూడా పవన్ కల్యాణ్ తెచ్చుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబు.. సినిమాల్లో పవర్స్టార్ అని చెప్పుకుంటూ తిరిగే పవన్ కల్యాణ్..ఈ ఎన్నికల తరువాత కనిపించరని రోజా జోస్యం చెప్పారు. పైకి కనిపించని భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని, వైఎస్ఆర్సీపీని ఓడించలేమనే నిర్ధారణకు వచ్చినట్టయిందని తేల్చి చెప్పారు.

14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నానంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టాడని విమర్శించారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని నిలువునా ముంచాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని కూడా పణంగా పెట్టాడని అన్నారు.
చెప్పిన మాట మీద నిలబడలేని, ప్రకటించిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉండలేని చంద్రబాబును మరోసారి నమ్మి ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధంగా లేరని రోజా అన్నారు. అలాంటి టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్.. ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు ఓట్లు అడుగుతారని విమర్శించారు.












Click it and Unblock the Notifications