ఏపీలో మహా పాపం ఫ్లెక్సీల కలకలం..! కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్ ఎఫెక్ట్..!
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మహాపాపం పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తిరుమల లడ్డూ కోసం వాడిన నెయ్యి కల్తీ జరిగిందంటూ గతేడాది సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణపై సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరిపిన సిట్ తాజాగా నివేదికను సమర్పించింది. దీంతో పాటు కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేస్తోంది. ఈ సమయంలోనే సిట్ దర్యాప్తు నివేదిక వివరాలు బయటకు వచ్చాయి. ఇవి రాష్ట్రంలో మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
కల్తీ నెయ్యి వివాదంపై దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు.. అందులో జంతువుల కొవ్వులు కలవకపోయినా.. రసాయనాలు కలిపారని నిర్దారించారు. అయితే జంతువుల కొవ్వు కలపలేదన్న అంశం ఆధారంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని పలు దేవాలయాల ఎదుట నిరసనలకు దిగుతోంది. దీంతో టీడీపీ (tdp) కూడా అలర్ట్ అయింది. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు చేసిన సూచనలతో ఇవాళ రంగంలోకి దిగిన టీడీపీ నేతలు ఫ్లెక్సీ వార్ ప్రారంభించారు.

లడ్డూ కల్తీని సిట్ నిర్ధారించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి అంటూ ఈ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. అది నెయ్యే కాదని, పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం అంటూ పోస్టర్లపై రాశారు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ ఘీ అని తెలిపారు. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారన్నారు. వైసీపీ పెద్దలు రూ.251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారని ప్రస్తావించారు. ఈ ఫ్లెక్సీలపై జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫొటోల్ని కూడా ముద్రించారు. విజయవాడలో అధికారికంగా టీడీపీ నేతలు ఈ పోస్టర్లు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications