సీఎంగా జగన్ కన్నా ఆ ఎమ్మెల్యేకే బాగా పేరొస్తోందే?
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో తమ పార్టీ కౌన్సిలర్ విజయ్ కుమార్పై వైసీపీ గూండాల దాడి హేయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీకి చెందిన నలుగుురు వ్యక్తులు కర్రలతో విజయ్కుమార్పై దాడికి పాల్పడ్డారని.. రెండు రోజుల క్రితం మరో కౌన్సిలర్ మల్లికార్జున పైనా దాడి చేశారని ఆరోపించారు. దళితులపై సీఎం కక్ష కట్టారని, రాష్ట్రంలో వైఎస్సార్ దళితులపై దాడులు కానుక పథకం అమలవుతోందని ధ్వజమెత్తారు.
తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగడాలను కట్టడి చేయాలని, జగన్ను మించిన నియంతలా వ్యవహరిస్తున్నాడన్నారు. టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్రెడ్డి బైఠాయింపు
టీడీపీ కౌన్సిలర్లపై దాడిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చూడనట్లు నటిస్తున్నారని ఆరోపించారు.
ప్రభాకర్ రెడ్డి పీఎస్ ఎదుట నిరసనకు దిగడంతో ఆయనకు మద్దతుగా టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించారు.