ఇరాన్ తో సీజ్ ఫైర్ ముగిసింది.. ఇక చర్చలు లేవు: ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కేవలం నెల రోజులకే కుప్పకూలింది. ఇరాన్ తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల నేపథ్యంలో, ఇరాన్ పై అమెరికా సైన్యం భారీ వైమానిక దాడులకు దిగింది.
ఈ సైనిక చర్యను ధృవీకరిస్తూ నాటో సదస్సులో పాల్గొంటున్న ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలనులను నమ్మశక్యం కాని మోసగాళ్లుగా అభివర్ణిస్తూ, వారిపై అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు ప్రకటించారు.వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వైమానిక దాడులకు పచ్చజెండా ఊపింది.
మళ్లీ రగులుతున్న యుద్ధ మేఘాలు
దక్షిణ ఇరాన్ లోని ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్ తో పాటు బందర్ అబ్బాస్, క్వేష్మ్ ఐలాండ్ వంటి కీలక ప్రాంతాల్లో అమెరికా దాడులతో భారీ పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలు, డ్రోన్ లాంచ్ కేంద్రాలే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఈ విధ్వంసకర దాడులను వేగంగా నిర్వహించింది.
అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఓమన్ సముద్రంలో ఉన్న అమెరికా నౌకాదళ యుద్ధనౌకలపై ఇరాన్ తీవ్రస్థాయిలో ఎదురుదాడులకు దిగింది. తమ రక్షణ బలగాల ద్వారా కనీసం రెండు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు, పలు పేలుడు డ్రోన్లను అమెరికా నౌకల వైపు ప్రయోగించినట్లు స్థానిక ఇరాన్ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జలసంధి ప్రాంతంలో ఇరు దేశాల రక్షణ దళాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
యూకే మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నివేదిక ప్రకారం, ఒమన్ తీరానికి సమీపంలో గుర్తు తెలియని క్షిపణి దాడితో ఒక చమురు రవాణా నౌకలో మంటలు చెలరేగాయి. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు భద్రత కల్పించే విషయంలో ఇరాన్ విధించిన కొత్త నిబంధనలు, రవాణా రుసుము చెల్లింపుల వివాదమే ఈ తాజా అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా నిలిచింది.

ఫిబ్రవరి నెలలో చోటుచేసుకున్న సైనిక ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి గత నెలలోనే ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే తాజా పరిణామాలతో ఆ ముసాయిదా పూర్తిగా రద్దయింది. ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా తమ తదుపరి వ్యూహం ఉంటుందని అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications