కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతం
కర్ణాటకలో నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. కర్ణాటక జాయింట్ యాక్షన్ కమిటీ.. కన్నడ ఒక్కూట ఈ బంద్ కు పిలుపునిచ్చింది. బెంగళూరు సహా చాలాచోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. మరి కొన్ని చోట్ల సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు యథాతథంగా పని చేస్తోన్నాయి. బెంగళూరులో బీఎంటీసీ బస్సుల రాకపోకలపైనా పెద్దగా ప్రభావం పడలేదు.
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ హక్కుల పరిరక్షణ వేదిక నేత వాటాల్ నాగరాజ్ ఈ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కిందటి నెల 28వ తేదీ నుంచి కర్ణాటక ప్రభుత్వం రోజూ 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం పట్ల కర్ణాటక హక్కుల పరిరక్షణ వేదిక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

దీనికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగాల్సి ఉంది. కావేరి నదీ పరీవాహక ప్రాంత జిల్లాలు.. మండ్య, మైసూరు, చామరాజనగర, మడికెర్రి, హాసన్ లల్లో సానుకూల స్పందన లభించింది. బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల కేఎస్ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బస్సులు డిపోల నుంచి బయటికి రాకుండా ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించారు. తమిళనాడుకు కావేరీ నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలంటూ నినదించారు.
బెంగళూరులో బంద్ ప్రభావం అంతంత మాత్రమే. ఆటో, క్యాబ్ యూనియన్లు పెద్దగా స్పందించట్లేదు. ఫలితంగా ఆటోలు, క్యాబ్ లు రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వాటి సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎప్పట్లాగే పని చేస్తోన్నాయి. బంద్ ప్రారంభమైనప్పటికీ వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగలేదు.
నగరవ్యాప్తంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు బెంగళూరు నగర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు గిరీష్ గౌడను ఈ తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. తమిళ ప్రజలు అధికంగా నివసించే మత్తికెర, శివాజీనగర్, ఉల్సూర్, ఫ్రేజర్ టౌన్ , కాక్స్ టౌన్, శ్రీరాంపుర, చామరాజ్పేట, మల్లేశ్వరం, ఆర్టీ నగర్, వివేక్నగర్, విల్సన్ గార్డెన్, వసంత నగర్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. బలవంతంగా దుకాణాలు మూసివేయించినా, రవాణా వ్యవస్థను అడ్డుకోవడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫ్రీడమ్ పార్క్లో మాత్రమే బంద్ రోజున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించడానికి అనుమతి ఉందని, రోడ్లపై ర్యాలీలు తీయడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు.
మెజెస్టిక్, శాంతినగర్, యశ్వంత్ పురా, యలహంక వంటి బస్ స్టేషన్ల నుంచి బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తోన్నాయి. మెజస్టిక్ బస్ స్టేషన్ వద్ద ఏసీపీ దీపక్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ బలగాలను మోహరింపజేశారు.
బెంగళూరు- తమిళనాడు సరిహద్దుల్లో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హోసూరు, అత్తిబెలె బోర్డర్ చెక్పోస్టు వద్ద కన్నడ జాగృతి వేదిక ఆధ్వర్యంలో ఆందోళనకారులు రోడ్డును దిగ్బంధనం చేశారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మంజునాథ్ దేవ్ నేతృత్వంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. తమిళనాడు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేకేదాటు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, ఈ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదని డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications