హైదరాబాద్ కు మరో వరం.. కేంద్ర పథకం భవ్య తో బిగ్ బూస్ట్!
తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భవ్య పథకాన్ని అమలు చేయనున్నాయి. భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన పథకం ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల కొత్త పారిశ్రామిక అభివృద్ధి మొదలు కాబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్త భాగస్వామ్యంతో భాగ్యనగరానికి భవ్య పారిశ్రామిక హారాన్ని అందించనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ నాలుగు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి.
మెట్రో నగరాల శివార్లలో పరిశ్రమలు.. కేంద్ర భవ్య పథకం
ఇవి టీజీఐఐసి భూముల్లో త్వరలోనే నెలకొల్పబడతాయి. మెట్రో నగరాల శివార్లలో పరిశ్రమలు ఉంటే యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. భవ్య పథకం దేశవ్యాప్తంగా వంద పారిశ్రామిక పార్క్ లను నిర్మించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించింది.

హైదరాబాద్ చుట్టూ నాలుగు పారిశ్రామిక పార్కులు
ఒక పార్క్ 100 నుండి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కేంద్రం ఎకరానికి ఒక కోటి రూపాయలను ఈక్విటీగా అందిస్తుంది. ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్కులలో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పించి ఆ తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, మల్టీ నేషనల్ కంపెనీలకు భూములను కేటాయిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రాంతాలలోనే పారిశ్రామిక పార్క్ లు
ఈ మేరకు టీజీఐఐసీ అధికారులు ఇప్పటికే వ్యూహాత్మక ప్రాంతాలను ఎంపిక చేశారు. హైదరాబాద్ కు 30- 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం మాదారం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండు మల్కాపూర్ గ్రామాలను ఈ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సెలెక్ట్ చేశారు.
ప్రతీ పారిశ్రామిక పార్క్ కు స్పెషాలిటీ
మాదారం, తిమ్మాపూర్ రెండు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నాయి. ఎలిమినేడు భారత్ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండగా, దండు మల్కాపూర్ హైదరాబాద్ విజయవాడ జాతీయరహదారి పైన ఉంది. ఈ పారిశ్రామిక పార్కులలో ప్రతిపార్కుకు ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. తిమ్మాపూర్లో సెమీ కండక్టర్ పరిశ్రమలు, దండు మల్కాపూర్లో ఇంజనీరింగ్ యంత్రాలు, ఎలిమినేడులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఆధారిత పరిశ్రమలు, మాదారంలో ఐటీ, హార్డ్వేర్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంటుంది.
హైదరాబాద్ ను భవ్య నగరంగా మార్చే భవ్య పథకం
వీటి కేటాయింపు కోసం ఆసక్తి ఉన్న పారిశ్రామిక వర్గాల నుండి దరఖాస్తులు వచ్చిన వెంటనే స్థలాలను కేటాయించి వేగంగా నిర్మాణాలు జరిగేలా అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిశ్రమలను ప్రోత్సహించడానికి అందిస్తున్న భవ్య పథకం హైదరాబాద్ ను భవ్య నగరంగా మార్చనుంది.













Click it and Unblock the Notifications