వాలంటీర్లపై టీడీపీ పాలసీ ఇదే-ముందస్తుపై ఆయనకే తెలుసు- లోకేష్ కామెంట్స్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగడతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్ధపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని అందుకుని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్వరం పెంచారు. అలాగే ముందస్తు ఎన్నికలపై జగన్ ఢిల్లీ టూర్ తర్వాత చర్చ పెరిగింది. వైసీపీ ఎంత లేదని చెబుతున్నా విపక్షాలు మాత్రం ముందస్తుకు సిద్ధమైపోతున్నాయి.
ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఇవాళ టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు. వైసీపీ నేతల ప్రమేయంతో రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగిపోతోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి కేంద్రం ఇస్తున్న నివేదికల్ని కూడా అందించారు.ఈ డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువతపై పడుతున్న ప్రభావాన్ని గవర్నర్ కు వివరించారు. అనంతరం మీడియాలో మాట్లాడిన లోకేష్.. వాలంటీర్లు, ముందస్తు ఎన్నికలపై స్పందించారు.

వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారకూడదన్నది తెలుగుదేశం విధానమని లోకేశ్ అన్నారు. వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా రాజకీయ అవసరాలకు వాడుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రగిరిలో వాలంటీర్ల ద్వారా డేటా సేకరణ ఉదంతం వెలుగు చూసిందని, వాలంటీర్లయినా, మరెవరైనా రాజ్యాంగం లోబడి పనిచేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం ఉండగా, వాలంటీర్ల ద్వారా మళ్లీ సమాచార సేకరణ దేనికి అని నారా లోకేష్ ప్రశ్నించారు.

మరోవైపు ముందస్తు ఎన్నికల ఊహాగానాలపైనా లోకేష్ స్పందించారు. ముందస్తు ఎన్నికల గురించి ప్రభుత్వ సలహాదారును అడగాలంటూ సజ్జలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముందస్తు కు వెళ్లే ముందు ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చాలి కదా అన్నారు. పెన్షన్,అమ్మఒడి,స్థానికులకు ఉద్యోగాలు ఇంకా అమలు కాలేదని లోకేష్ ఆరోపించారు. ముందస్తుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఇష్టమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అందుకు సిద్ధంగా ఉందని లోకేష్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications