నాదెండ్ల మనోహర్ కు టీడీపీ షాక్ - పొత్తుకు ముందే పంచాయితీ..!!
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నా ఆ పార్టీ కలవటంపైన ఇంకా స్పష్టత లేదు. బీజేపీ అధికారికంగా నిర్ణయం తీసుకొనే వరకూ వేచి చూడాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఇదే సమయంలో రెండు పార్టీల్లోని ముఖ్య నేతల మధ్య సీట్ల పంచాయితీ మొదలైంది. జనసేనలో నెంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తాను పోటీ చేసే సీటు పైన ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ముఖ్య నేత ఆ సీటు తనదేనని..తాను పోటీ చేసి తీరుతానని ప్రకటించారు.
తెనాలిపై మనోహర్ ఆశలు:
జనసేనతో పొత్తు అధికారికంగా ప్రకటన చేయలేదు. రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నాయి. కలిసి వస్తే బీజేపీ, లేకపోతే ఈ రెండు పార్టీలే వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసాయి. జనసేనాని పవన్ ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారు.

పొత్తులు ఖాయమని పవన్ స్పష్టం చేసారు. సీట్ల గురించి చంద్రబాబు...పవన్ చర్చిస్తారని చెప్పిన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తాను వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తెనాలిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. తాను పోటీ చేయటం ఖాయమని..ఎవరికీ సందేహాలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో, పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేన నుంచి మనోహర్ కు ఖాయమని అందరూ భావించారు.
టీడీపీ నేత తేల్చేసారు:
ఇప్పుడు టీడీపీ ముఖ్య నేత..మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అవినీతి చేసిన ప్రతీ ఒక్కరి గుండెల్లో నిద్రపోతా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తాను పోటీలో లేనని సంతోషిస్తున్న వారందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.
తెనాలిలో తాను పోటీ లేనని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. దీని ద్వారా తెనాలి నుంచి పోటీకి సిద్దపడుతున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు షాక్ ఇచ్చినట్లు అయింది. మనోహర్..ఆలపాటి రాజా..ఇద్దరు నేతలు రెండు పార్టీల్లోనూ ముఖ్య నేతలుగానే ఉన్నారు. ఇద్దరూ ఒకే సీటు కోసం పోటీ పడుతున్నారు.
పొత్తులు..సీట్లు..దక్కేదెవరికి:
దీంతో, ఇప్పుడు ఇద్దరు నేతల్లో ఒకరికి ప్రత్యామ్నాయ సీటు పైన హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనోహర్ కోసం పవన్ కల్యాణ్ నేరుగా చంద్రబాబు వద్ద తెనాలి సీటును ప్రతిపాదిస్తే..చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. రెండు పార్టీల మధ్య పొత్తు పైన అధికారిక ప్రకటన వచ్చిన తరువాత సీట్ల సర్దుబాటు పైన చర్చ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమయంలోనే అప్పుడే సీట్ల పైన రెండు పార్టీల నుంచి భిన్న ప్రకటనల ద్వారా పంచాయితీ మొదలైంది.
ఒక రకంగా రెండు పార్టీలకు చెందిన నేతలు తమ సీట్ల కోసం పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇదే రకమైన పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మరిన్ని సీట్ల విషయంలోనూ చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో, పొత్తులు..సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన రెండు పార్టీల ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications