తాళి తెంపకుండానా, కేశవరెడ్డి 800 కోట్లు కొల్లగొట్టాలా: ఆదినారాయణపై టిడిపి నేత తీవ్ర వ్యాఖ్యలు
కడప: తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి శుక్రవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణ రాకను రామసుబ్బా రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.
శుక్రవారం ఆయన పరోక్షంగా ఆదినారాయణ రెడ్డి పైన వ్యాఖ్యానించారు. ఆదినారాయణ రెడ్డి తీరు విడాకులు తీసుకోకుండానే పెళ్లికి సిద్ధమైనట్లుగా ఉందని, ఆయన నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నారని ధ్వజమెత్తారు. తాళి తెంపకుండానే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లుగా ఉందన్నారు.
కేశవ రెడ్డి పాఠశాలల ద్వారా రూ.800 కోట్లు కొల్లగొట్టడమే ఆయన ఉద్దేశ్యమా అని నిలదీశారు. ఏ ఆలోచనతో ఆదినారాయణ టిడిపిలోకి వస్తున్నారో స్పష్టం చేయాలన్నరు. ఆదినారాయణ రెడ్డికి దమ్ముంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని సవాల్ చేశారు.
భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో నిర్ణయం: కొణతాల
భవిష్యత్తు కార్యాచరణ పైన తాను త్వరలో నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, బాక్సైట్ తవ్వకాలు, పోలవరం ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించానన్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ప్రారంభించిన చంద్రబాబు
నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిచాలన్న లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ వైద్య సేవ' పథకానికి శ్రీకారం చుట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం కింద అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 60 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంపై అధ్యయనం చేసి అవసరమైన సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.