బీజేపీతో పొత్తుల వేళ.. టీడీపీకి సీనియర్ నేత గుడ్బై
TDP BJP Alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.
ఇప్పుడీ రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన- బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.

ఈ పొత్తుల వ్యవహారం తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులకు మింగుడు పడట్లేదు. చంద్రబాబు తీసుకుంటోన్న నిర్ణయాలతో విభేదిస్తోన్నారు. పార్టీలో కొనసాగడానికీ ఇష్ట పడట్లేదు.ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఏపీఎస్ఆర్టీసీ మాజీ ఛైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి.. తెలుగుదేశానికి గుడ్బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగానని, ఎన్నో అడ్డంకులను అధిగమించానని, కడప జిల్లాలో పార్టీని నిలబెట్టడానికి కృషి చేశానని అన్నారు.
ఈ మధ్యకాలంలో పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
రాజీనామా చేసిన వెంటనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెడ్యం. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన సోదరుడితో కలిసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. మైదుకూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని అన్నారు.రెడ్యం వెంకట సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం.. మైదుకూరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కు కుడి భుజంగా పేరుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications