వర్మకు మళ్లీ మంచిరోజులు- పిఠాపురంలో పవన్ తోడుగా...!
ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం నిత్యం వార్తల్లో ఉండటానికి ఓ కారణం పవన్ కళ్యాణ్ అయితే మరో కారణం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. గత ఎన్నికల్లో పవన్ కోసం తన సీటు త్యాగం చేసిన వర్మకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వర్మకు పుండుమీద కారం జల్లినట్లుగా జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలతో ఇరువర్గాలకూ మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అయితే ఇవాళ మాత్రం పవన్ కళ్యాణ్ టూర్ లో అనూహ్య దృశ్యాలు కనిపించాయి.
పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ నేత వర్మ కూడా కనిపించారు. పవన్ వెళ్లిన ప్రతీ చోటా ఆయనతో పాటు వర్మ కూడా కనిపించారు. అదీ పవన్ పక్కనే ఉన్నారు. దీంతో వర్మకు తిరిగి మంచి రోజులు వచ్చాయా అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ టూర్ లో ఈసారి వర్మకు మంచి ప్రాధాన్యమే దక్కడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గత ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ అందుకు కారణమైన వర్మకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆ తర్వాత మాత్రం ఎమ్మెల్సీ పదవి రాకపోవడంతో వర్మలో అసంతృప్తి మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రెండు అధికార కేంద్రాలు ఉండకూడదనే ఉద్దేశంతో వర్మకు ఎమ్మెల్సీ పదవిని అడ్డుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో వర్మ కూడా ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణుల వద్ద పదే పదే ప్రస్తావించడం మొదలుపెట్టారు. దీంతో జనసేన నేతలు ఆయనకు కౌంటర్లు ఇవ్వడం కూడా మొదలైపోయింది.

కానీ ఇవాళ పవన్ పిఠాపురం టూర్ లో మాత్రం వర్మను తోడుగా కలుపుకుని కార్యక్రమాల్లో పాల్గొనడంతో వీరి మధ్య గ్యాప్ తగ్గినట్లు అర్థమవుతోంది. అలాగే వర్మకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. మరి చంద్రబాబు, పవన్ వర్మ విషయంలో ఈసారైనా కరుణిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications